Kara Master: ప్రముఖ రచయిత 'కారా' మాస్టారు కన్నుమూత.. విషాదంలో సాహితీలోకం!

  • శ్రీకాకుళంలోని తన నివాసంలో కన్నుమూసిన కాళీపట్నం రామారావు
  • కేంద్ర సాహిత్య పురస్కారాన్ని పొందిన గొప్ప రచయిత కారా మాస్టారు
  • 1997లో సాహితీలోకంను ప్రారంభించిన మాస్టారు
Eminent writer Kara master dies

ప్రముఖ సాహితీవేత్త కాళీపట్నం రామారావు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన సొంత నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సాహితీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రచయితలు, కవులు, కళాకారులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. ఆయన లేని లోటును ఎప్పటికీ పూడ్చలేమని చెపుతున్నారు.

ఎన్నో అద్భుతమైన రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఒకరైన ఆయన కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందారు. కేంద్ర సాహిత్య పురస్కారాన్ని కూడా పొందారు. కథానిలయాన్ని స్థాపించిన ఆయన... సాహితీలోకానికి ఎంతో సేవ చేశారు. ఎందరో రచయితలను ప్రోత్సహించారు.

శ్రీకాకుళం జిల్లా మురపాకలో 1924లో కారా మాస్టారు జన్మించారు. తనదైన శైలిలో వ్యాసంగాలను కొనసాగిస్తూ అనతి కాలంలోనే గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నారు. వేలాది మంది శిష్యులకు మార్గనిర్దేశం చేసే గురువుగా, స్ఫూర్తిదాతగా నిలిచారు.

1964లో ఆయన రాసిన 'యజ్ఞం' కథా రచయితగా ఆయన ఖ్యాతిని నలుదిశలా చాటింది. ఈ రచన రష్యన్ భాషలోకి కూడా అనువదించబడింది. 1997 ఫిబ్రవరిలో శ్రీకాకుళంలో ఆయన కథానిలయాన్ని ప్రారంభించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా వచ్చిన డబ్బుతో పాటు, కొందరు సాహితీవేత్తల సహకారంతో 800 పుస్తకాలతో కథానిలయాన్ని ఆయన స్థాపించారు. ఇప్పుడు ఆ కథానిలయం లక్ష పుస్తకాలతో అలరారుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు.

కాళీపట్నం రామారావు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. గ్రాంధిక భాషను పక్కన పెట్టి, సామాన్యుడికి అర్థమయ్యే... సరళమైన రచనా శైలితో ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ఆయన రచనల్లో రుతుపవనాలు, జీవధార, కారా కథలు, రాగమయి, కుట్ర తదితరాలు ఎంతో ఆదరణ పొందాయి.

More Telugu News