వినియోగదారులు, చిన్న వ్యాపారులకు ఊరట.. యూపీఐపై ఛార్జీలుండవ్!

Relief for consumers and small merchants No charges on UPI
  • వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితం
  • చిన్న వ్యాపారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరు
  • పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై ఛార్జీలు విధించవచ్చనే చర్చలకు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) శుక్రవారం తెరదించింది. వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని, చిన్న వ్యాపారుల నుంచి ఎటువంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయబోమని శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

2016లో ప్రారంభమైనప్పటి నుంచి యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులోనూ లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన ఏదీ లేదని పీసీఐ తన పోస్టులో పేర్కొంది. భారతీయులందరూ ఎటువంటి అదనపు రుసుములు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు కొనసాగించవచ్చని భరోసా ఇచ్చింది. అదేవిధంగా, చిన్న వ్యాపారులు సైతం యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని సుస్థిరత, నిర్వహణ వ్యయాలపై కొంతకాలంగా విస్తృత చర్చ జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం, సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేయడం, ఆర్థిక మోసాల నివారణ వంటి అంశాలకు అవసరమైన నిధులపై ఈ చర్చలు కేంద్రీకృతమయ్యాయి. ఈ క్రమంలోనే యూపీఐ ఛార్జీలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ పీసీఐ ఈ స్పష్టతనిచ్చింది. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, ఎన్‌పీసీఐ, ఆర్‌బీఐ సమన్వయంతో గత దశాబ్ద కాలంగా ఈ చెల్లింపుల వ్యవస్థను నిర్మించాయని గుర్తుచేసింది.

భవిష్యత్తులో కొన్ని రకాల డిజిటల్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పించేలా చట్టపరమైన మార్పులు జరిగినప్పటికీ, ప్రస్తుతానికి వినియోగదారులు మరియు చిన్న వ్యాపారులపై ఎటువంటి అదనపు భారం ఉండదని ఈ ప్రకటనతో స్పష్టమైంది.
Advertisement
UPI
Payments Council of India
Digital Payments India
UPI Transaction Charges
Merchant Discount Rate
NPCI

More Telugu News