COVID19: ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నవి 100 ఐసీయూ బెడ్లే: సీఎం అరవింద్​ కేజ్రీవాల్​

Delhi Scrambles with Beds Shortage have only 100 ICU Beds
షార్ట్స్‌లో చూడండి
కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్, కొన్ని పాఠశాలలను కరోనా కేంద్రాలుగా మార్చుతున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో 6 వేల కొత్త బెడ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని, అందుకనుగుణంగా ఆసుపత్రుల్లో బెడ్లనూ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఆదివారం కేబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలో కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం ఐసీయూల్లో కేవలం వంద పడకలే ఉన్నాయన్నారు. కరోనా పాజిటివ్ రేటు 30 శాతంగా ఉందన్నారు. కరోనా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో మాట్లాడానని చెప్పారు. రాష్ట్రానికి మరింత ఆక్సిజన్, మరిన్ని బెడ్లు కావాలని చెప్పానన్నారు. రెండు మూడు రోజుల్లో 6 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 10 వేల పడకలను ఇచ్చిందని, అందులో 1,800 మాత్రమే కరోనా బెడ్లని చెప్పారు. మరో 7 వేల బెడ్లను కరోనా కోసం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కాగా, చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఎక్కువ వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా, ఢిల్లీలో శనివారం ఒక్కరోజే 24,375 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు ఢిల్లీలో పరిస్థితులు చాలా తీవ్రంగానే ఉన్నాయని, అయితే, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. ఫస్ట్ వేవ్ లో కొన్ని నెలలు కలిపి నమోదైన కేసులన్నీ.. ఇప్పుడు సెకండ్ వేవ్ లో ఒక్కరోజులోనే నమోదవుతున్నాయని చెప్పారు. ఫస్ట్ వేవ్ లో తప్పించుకున్న వారు.. ఇప్పుడు సెకండ్ వేవ్ లో మహమ్మారి బారిన పడుతున్నారన్నారు.
Go Back to Shorts
COVID19
New Delhi
Arvind Kejriwal

More Telugu News