Maharashtra: మహారాష్ట్రపై మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా.. 5 జిల్లాల్లో లాక్‌డౌన్

  • నేటి నుంచి మార్చి 1 వరకు అమల్లో లాక్‌డౌన్
  • పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్
  • లాక్‌డౌన్ వద్దనుకుంటే ప్రజలు బుద్ధిగా ఇళ్లలోనే ఉండాలన్న సీఎం
corona lockdown once again in maharashtra

కరోనా మహమ్మారి మహారాష్ట్రపై మళ్లీ పంజా విసురుతోంది. కేసులు పెరుగుతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్‌‌ జిల్లాలలో వారం రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. నేటి రాత్రి నుంచి మార్చి 1 వరకు ఇది అమల్లో ఉంటుంది.

అలాగే నేటి నుంచి పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

గత రెండు వారాల్లో కేసులు 2,500 నుంచి ఏడు వేలకు పెరిగాయని, పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సీఎం హితవు పలికారు.

More Telugu News