Gang Leader: 30 ఏళ్ల తరువాత కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్!

  • 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్
  • తిరిగి కలుసుకున్న చిరంజీవి, మురళీ మోహన్, శరత్ కుమార్
  • వైరల్ అవుతున్న పిక్
Gang Leader Brothers At One Place After 30 Years

1990 దశకం ఆరంభంలో చిరంజీవి, విజయశాంతి హీరో హీరోయిన్లుగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' చిత్రం గుర్తుందిగా? ఆ సినిమాలో సోదరులుగా నటించిన మురళీమోహన్, శరత్ కుమార్, చిరంజీవిలు దాదాపు 30 సంవత్సరాల తరువాత తిరిగి ఒకే చోట కలిశారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. 'గ్యాంగ్ లీడర్' తరువాత వీరు ముగ్గురూ ఒకేసారి కలవలేదు. ఇద్దరిద్దరు విడిగా కలిసిన సందర్భాలు ఉన్నాయిగానీ, అందరూ ఒకే చోటకు చేరలేదు.

హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం చిరంజీవి కొత్త చిత్రం 'ఆచార్య' షూటింగ్ జరుగుతుండగా, అదే సమయంలో మురళీ మోహన్, శరత్ కుమార్ లు తమతమ చిత్రాల కోసం అదే చోటకు వచ్చారు. ముగ్గురూ కలుసుకుని నాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ముగ్గురమూ కలవగానే 1991లో తాము పాల్గొన్న సినిమా షూటింగ్ జ్ఞాపకం వచ్చిందని ఈ సందర్భంగా మురళీ మోహన్ వ్యాఖ్యానించారు.

అనుకోకుండా జరిగే ఘటనలు పాత అనుభూతులను గుర్తుకు తెస్తాయని వ్యాఖ్యానిస్తూ, ఈ ఫోటోను షేర్ చేసుకున్నారు. ఇక ఈ పిక్ ను చూసిన మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. నాటి సినిమా దృశ్యాలను, ఈ చిత్రాన్ని ఒక చోట చేర్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

More Telugu News