Madhavi Latha: ఇక్కడ కూడా పార్టీల్లో డ్రగ్స్ వాడుతుంటారు.. టాలీవుడ్ పై ఎన్సీబీ ఓ కన్నేయాలి!: సినీ నటి మాధవీలత

Actress Madhavi latha Sensational comments on Drugs
  • టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలే జరగవు
  • తెలుగు చిత్ర పరిశ్రమపైనా నార్కోటిక్స్ అధికారులు దృష్టిసారించాలి
  • డ్రగ్స్‌ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో నేను చూశా
ప్రస్తుతం బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కాకరేపుతోంది. పలువురు ప్రముఖులు, నటులు అరెస్టయ్యారు. విచారణ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి మాధవీలత తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడడం మామూలేనని, నార్కోటిక్స్ బ్యూరో తెలుగు చిత్ర పరిశ్రమపైనా ఓ కన్ను వేయాలని చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

సుశాంత్ మృతితో డ్రగ్స్ విషయం బయటపడడం మంచిదేనని, నిజానికి బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం రహస్యమేమీ కాదని మాధవీలత చెప్పింది. ఈ కేసుతోనైనా ప్రజల్లో మార్పు వస్తే మంచిదేనని పేర్కొన్న మాధవీలత.. టాలీవుడ్ పార్టీల్లోనూ డ్రగ్స్ అత్యంత సర్వసాధారణమైన విషయమని, ఈ విషయంలో ఇక్కడి ఎన్‌సీబీ అధికారులు దృష్టిసారిస్తే బాగుంటుందని పేర్కొంది.

గతంలో డ్రగ్స్ విషయంలో చేసినట్టు తూతూమంత్రంగా కాకుండా లోతుగా విచారించి నిజాలు వెలికి తీయాలని కోరింది. లాక్‌డౌన్ సమయంలోనూ హైదరాబాద్‌లో కొన్ని చోట్ల డ్రగ్స్‌తో పార్టీలు జరిగాయని పేర్కొంది. కేవలం హైదరాబాద్‌లో ఉన్న వారిపైనే కాకుండా టాలీవుడ్‌కు చెందిన వ్యక్తులపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని మాధవీలత కోరింది.

బాలీవుడ్‌లో నార్కోటిక్స్ అధికారులు చేస్తున్న విచారణను చూసిన తర్వాతే తానీ విషయాలు చెబుతున్నానని, డ్రగ్స్‌ను ఇక్కడి వారు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తాను చూశానని ఆమె పేర్కొంది. డ్రగ్స్ సరఫరా వెనక పెద్ద మాఫియా ఉందని తెలిసే ఇన్నాళ్లూ తానీ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడలేదని పేర్కొంది.
Madhavi Latha
BJP
Actress
Tollywood
Drugs
NCB

More Telugu News