Anushka Shetty: ఆఖరికి ఓటీటీ ద్వారానే రానున్న అనుష్క 'నిశ్శబ్దం'

  • థియేటర్ల మూతతో ఓటీటీకి పెరిగిన డిమాండ్ 
  • ఓటీటీ ద్వారా విడుదలకు ఒప్పుకోని అనుష్క
  • చివరికి ఓటీటీ వైపే మొగ్గిన నిర్మాతలు 
  • వచ్చే నెల నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్    
Anushka movie Nishshabdam to be released on OTT

కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికై విధించిన లాక్ డౌన్ లో భాగంగా గత ఐదు నెలల నుంచి థియేటర్లు కూడా మూతబడిన సంగతి విదితమే. దీంతో అప్పటికే పూర్తయిన చిత్రాల విడుదలకు పెద్ద ఇబ్బంది ఏర్పడింది. దీంతో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫాంల వేదికగా విడుదల చేసేస్తున్నారు. అయితే, స్టార్ హీరోల సినిమాలు మాత్రం థియేటర్ల కోసం ఎదురుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ కథానాయిక అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన 'నిశ్శబ్దం' చిత్రం కూడా ఎప్పుడో పూర్తయి, విడుదలకు రెడీ అయింది. దీనిని కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నించినా, అనుష్క అభ్యంతరం చెప్పడం వల్ల ఆగిందని ఇన్నాళ్లూ వార్తలొచ్చాయి.

అయితే, ఇక ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపించకపోవడంతో చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ తో అప్పుడే డీల్ కూడా ఓకే అయ్యిందని అంటున్నారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.  

More Telugu News