Chandrababu: ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో ఇవిగోండి సాక్ష్యాలు: చంద్రబాబు

  • గత అనుమతులను వివరించిన చంద్రబాబు
  • వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లే క్లియరెన్స్ లు ఇచ్చాయని వెల్లడి
  • సవాల్ కు సిద్ధమా అంటూ వ్యాఖ్యలు
 Chandrababu slams AP Government over LG Polymers issue

ఎల్జీ పాలిమర్స్ కు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చారంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ అనుమతుల్లో టీడీపీపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. సీఎం జగన్ చెబుతున్న అవాస్తవాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడడం దారుణమని అభిప్రాయపడ్డారు. అందుకే సాక్ష్యాధారాలతో సహా ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపారు.

1961 నుంచి 2020 వరకు ఈ కంపెనీ పూర్వాపరాలను ప్రజల దృష్టికి తెస్తున్నామని వివరించారు. కంపెనీ వినియోగిస్తున్న 219 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 1964లో నవంబరు 23న అప్పటి సర్కారు ఎకరా రూ.2,500 చొప్పున కేటాయించినట్టు వెల్లడించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను 1992లో అక్టోబరు 8న అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని, టీడీపీ హయాంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎల్జీ పాలిమర్స్ కు కేటాయించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

2007లో మే 8న వైఎస్ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిందని, 2009లోనూ వైఎస్ ప్రభుత్వమే మరోసారి పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిందని వివరించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2012లో ఏప్రిల్ 13న, 2012లో మే 6న పలు క్లియరెన్స్ లు ఇచ్చిందని తెలిపారు. వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాలు రెండుసార్లు చొప్పున అనుమతులు ఇచ్చాయని వెల్లడించారు.

ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లను మాత్రమే టీడీపీ ప్రభుత్వం రెన్యువల్ చేసిందని చెప్పారు. పాలిస్టైరీన్ విస్తరణ, ఉత్పత్తుల విస్తరణకు టీడీపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని తెలిపారు. తాము సమర్పించిన వివరాలపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు.

More Telugu News