మోదీకి చంద్రబాబు వంటి నేతలు తోడైతే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది: సజ్జన్ జిందాల్

Sajjan Jindal says India develops faster if leaders like Chandrababu join PM Modi
  • ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌పై సజ్జన్ జిందాల్ ప్రశంసలు
  • కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం
  • రాష్ట్రంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని జిందాల్ ప్రకటన
  • ఈ పెట్టుబడులతో 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని హామీ
  • చంద్రబాబు లాంటి నేతలుంటే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్న జిందాల్
ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి దార్శనికత ఉన్న నాయకులు దేశంలో చాలా అరుదుగా ఉంటారని, ఆయన వచ్చే 25 ఏళ్ల అభివృద్ధిని ముందుగానే ఆలోచించి అమలు చేస్తారని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు విజన్ వల్లే సైబరాబాద్ నగరం ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా ఎదిగిందని ఆయన గుర్తుచేశారు. దేశాభివృద్ధి గురించి నిత్యం తపించే ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు తోడైతే, దేశం మరింత వేగంగా లక్ష్యాలను అందుకుంటుందని జిందాల్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వంటి నేతలతో కలిసి పనిచేయడం పారిశ్రామికవేత్తగా తనకు గౌరవమని ఆయన పేర్కొన్నారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, సజ్జన్ జిందాల్‌తో కలిసి ఆయన కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ.. తమ గ్రూప్ తరపున ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.50 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ పెట్టుబడులతో సుమారు 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని హామీ ఇచ్చారు.

రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో పాటు విజయనగరం జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నామని జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఏడాదికి 1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభమవుతున్న ఈ స్టీల్ ప్లాంట్‌ను భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

ఈ స్టీల్ ప్లాంట్‌ను మొత్తం రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో నిర్మించనున్నారు. తొలిదశ పూర్తయితే ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్‌తో పాటు, దీనికి అనుబంధంగా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.
Sajjan Jindal
Nara Chandrababu Naidu
JSW Rayalaseema Steel Limited
Andhra Pradesh Industrial Investment
Kadapa Steel Plant
Narendra Modi

More Telugu News