హైదరాబాద్లో దారుణం: ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతూనే మహిళ ఆత్మహత్య
- హైదరాబాద్ హోటల్లో వివాహిత ఆత్మహత్య కలకలం
- స్నేహితురాలితో వీడియో కాల్ మాట్లాడుతూనే బలవన్మరణం
- మరో వ్యక్తితో కలిసి హోటల్లో గది తీసుకున్న మహిళ
- ఇది ఆత్మహత్య కాదు హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసుల కథనం ప్రకారం, అల్వాల్కు చెందిన రేణుక (26) అనే వివాహితకు ఒక బిడ్డ ఉంది. ఆమె గోల్కొండ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో కలిసి హోటల్లో గది తీసుకుంది. అతనికి కూడా వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. గురువారం రాత్రి తాను ఒక వేడుకకు వెళుతున్నానని ఆ వ్యక్తి చెప్పి హోటల్ నుంచి బయటకు వెళ్లాడు.
ఒంటరిగా ఉన్న రేణుక, శుక్రవారం తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలికి వీడియో కాల్ చేసింది. తన పుట్టినరోజు రాబోతోందని చెబుతూ, "నీకోసం నా దగ్గర బర్త్డే గిఫ్ట్ ఉంది" అని చెప్పి కెమెరా ఆన్లో ఉండగానే ఉరేసుకుంది. ఈ దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురైన స్నేహితురాలు వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్హౌస్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని రేణుక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రేణుకతో పాటు గది తీసుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, రేణుక మొబైల్ ఫోన్ను పరిశీలిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.