Warangal: కరోనా రోగులకు సేవ చేస్తున్నారని... బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు: వరంగల్ వైద్య విద్యార్థి తీవ్ర ఆవేదన!

  • ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నాం
  • ఎవరూ ఇళ్లను అద్దెకివ్వడం లేదు
  • విద్యార్థులను ఆదుకుంటామని కేఎంసీ ప్రిన్సిపాల్ హామీ
No Rented Homes for Medicos in Warangal

తామంతా ప్రాణాలకు తెగించి, కరోనా బాధితులకు చికిత్సను అందిస్తుంటే, అభినందించక పోయినా ఫర్వాలేదుగానీ, తమకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్నారని, ఇది తమకెంతో బాధను కలిగిస్తోందని, వరంగల్ కేఎంసీ (కాకతీయ మెడికల్ కాలేజీ)లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశాడు. తాము చేస్తున్న సేవలను మరచి, కరోనా వ్యాధి బారిన పడిన వారికి సేవ చేస్తున్నామన్న ఏకైక కారణంతో బలవంతంగా అద్దె ఇంటిని ఖాళీ చేయిస్తున్నారని, మరో ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదని అతను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

"తమ కోసం గతవారంలో చప్పట్లు కొట్టింది ఇందుకేనా?" అని అతను ప్రశ్నించాడు. కేఎంసీలో చదువుతున్న 200 మంది ఎంజీఎం ఆసుపత్రిలో హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారని, వీరిలో కొందరు కేఎంసీ హాస్టల్ లో ఉంటుండగా, మరికొందరు బయట అద్దె గదుల్లో ఉన్నారని, వీరందరినీ ఇంటి యజమానులు ఖాళీ చేయిస్తున్నారని వాపోయాడు.

కాగా, ఈ విషయం తెలుసుకున్న కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, స్టూడెంట్స్, హౌస్ సర్జన్లు ఎలాంటి ఆవేదనా చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేఎంసీలో మరో 50 మందికి వసతిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News