భారత్ రక్షణ మరింత పటిష్ఠం.. రూ.52 వేల కోట్లతో ఆయుధాల కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
- రూ.52 వేల కోట్ల కొనుగోళ్లకు ఆమోదం
- రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డీఏసీ సమావేశం
- సైన్యానికి యాంటీ డ్రోన్ వ్యవస్థలు
- నౌకాదళానికి కొత్త డ్రోన్లు, మైన్లు
- వాయుసేనకు అధునాతన నిఘా వ్యవస్థ
భారత సైన్యం కోసం యాంటీ డ్రోన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ 'ఆకాశ్ తరంగ్', మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, మీడియం రేంజ్ ‘సర్ఫేస్ టు ఎయిర్’ మిసైల్ వ్యవస్థ, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ట్యాంకులకు యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, జెట్ ఆధారిత కమికాజే డ్రోన్ వ్యవస్థ కొనుగోళ్లకు ఆమోదం లభించింది.
నౌకాదళం కోసం మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్, నౌకల నుంచి ప్రయోగించే మానవరహిత వైమానిక వ్యవస్థలకు, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థల పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. దీంతో సముద్ర నిఘా, శత్రు కదలికల పర్యవేక్షణ సామర్థ్యం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
వాయుసేన కోసం ‘ఫిక్స్డ్ వింగ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్’ కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది. దీని ద్వారా దీర్ఘకాలిక నిఘా, ఇంటెలిజెన్స్, టెలికమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ కొనుగోళ్లతో మూడు దళాల యుద్ధ సన్నద్ధత, సరిహద్దుల భద్రత, ఆధునిక సాంకేతిక సామర్థ్యాలు మరింత పెరుగుతాయని రక్షణ శాఖ వెల్లడించింది.