Budda Venkanna: విజువల్స్ లో చూపించినట్టుగా అతడు పొడుస్తున్నది నన్నే: బుద్ధా

  • మాచర్లలో దాడి ఘటనను మీడియాకు వివరించిన బుద్ధా
  • తన చేయి వాచిపోయిందని వెల్లడి
  • తాము కూడా ఇలాగే చేస్తే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడు కాదని వ్యాఖ్యలు
Buddha Venkanna shows his swollen hand to media

చంద్రబాబు తమను సన్మార్గంలో నడిపించాలని చూస్తారని, కానీ జగన్ తన నేతలను తప్పుదారిలో నడిపిస్తుంటాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. నాయకుడే అలాంటివాడైతే వీళ్లకు అడ్డుఅదుపు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. మాచర్లలో తమపై జరిగిన దాడిని పక్కా పథకం ప్రకారం చేసిన హత్యాయత్నంగా పేర్కొన్నారు. ఈ ఘటన గురించి వివరిస్తూ, విజువల్స్ లో చూపించినట్టు ఓ పెద్ద కర్రతో అతడు పొడుస్తున్నది తననే అని బుద్ధా స్పష్టం చేశారు.

"చూడండి నా చేయి ఎలా వాచిపోయిందో! అతడు పొడిచింది నన్నే. దాడి చేసింది కూడా కాక తప్పుడు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. రాజకీయాలు, అధికారం శాశ్వతం కాదు. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసిన చంద్రబాబునాయుడు ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నారు. దుర్మార్గపు పాలన చేస్తూ, దాడులు చేయిస్తున్న మీరు ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు. మీలాగా మేం చేసి ఉంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసేవాడు కాదు. ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ముగిసేవరకు చంద్రబాబు ఆయన్ని భద్రంగా కంటికి రెప్పలా చూశారు. రామకృష్ణారెడ్డీ, ఇవాళ మేం తిరిగిరాగలిగాం. కానీ మీలాగా మేం చేసివుంటే మీ జగన్ తిరిగొచ్చేవాడు కాదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News