Uttar Pradesh: చిక్కుల్లో క్రికెటర్ ప్రవీణ్ కుమార్ : మద్యం మత్తులో దాడిచేశాడని పక్కింటి వారు ఫిర్యాదు

షార్ట్స్‌లో చూడండి

టీమిండియా మాజీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. మద్యం మత్తులో తమపై దాడి చేశాడంటూ ఆయన ఇంటి పొరుగువారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. మీరట్ లోని టి.పి.నగర్‌లో ప్రవీణ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటి పక్కనే దీపక్ మిశ్రా కుటుంబం నివాసం ఉంటోంది.

దీపక్ నిన్న తన ఏడేళ్ల కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు ఉదయం వేచి ఉన్నాడు. స్కూల్ బస్సు రాగానే తన కొడుకుని బస్సు ఎక్కిస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రవీణ్ బస్సువల్ల ట్రాఫిక్ జామ్ అయ్యిందంటూ డ్రైవర్ పై ఫైర్ అయ్యాడు. నానా దుర్భాషలాడాడు. 

అదేమన్నందుకు అతని పై దౌర్జన్యం కూడా చేశాడు. అడ్డుకున్న దీపక్ మిశ్రా పైనా దాడిచేసి, అతని కుమారుడిని తోసేశాడు. దీంతో దీపక్ చేతికి గాయమైంది. అతను వెంటనే పోలీసులకు ప్రవీణ్ పై ఫిర్యాదు చేశాడు. తొలుత తటపటాయించిన పోలీసులు అనంతరం ఫిర్యాదు తీసుకున్నారని తెలిపాడు.

'ఘటన జరిగిన సమయానికి ప్రవీణ్ మద్యం మత్తులో ఉన్నాడు. అందుకే అతనలా ప్రవర్తించాడని అనుకుంటున్నాను. తానెంత సర్దిచెప్పినా అతను పట్టించుకోలేదు' అంటూ దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించగా ఫిర్యాదు అందిందని, విచారణ అనంతరం తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

Go Back to Shorts
Uttar Pradesh
cricketer
praveenkumar
mirat
police

More Telugu News