‘కాంగ్రెస్’ లో టికెట్లు అమ్ముకుంటున్నారట.. ఆడియో టేపుల కలకలం.. బయటపెట్టిన కాంగ్రెస్ నేత!

  • ఇబ్రహీంపట్నం టికెట్ కు రూ.3 కోట్లు ఇవ్వమన్నారు
  • నేను అబద్ధం చెబితే నన్ను ఉరితీయండి
  • స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ పై క్యామ మల్లేశం ఆరోపణ
ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ కొడుకు సాగర్ డిమాండ్ చేశారన్న ఆడియో టేపు బయటపడింది. ఈ ఆడియో టేపును టికెట్ దక్కని టీ-కాంగ్రెస్ నేత, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం బయటపెట్టారు. భక్త చరణ్ దాస్ కుమారుడు సాగర్ తో ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును ఆయన బయటపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక్కో టికెట్ ను 3 నుంచి 4 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

‘కాంగ్రెస్ పార్టీకి నేను చేసిన సేవ గురించి ప్రతిఒక్కరికీ తెలుసు. పోటీ చేసేందుకు నేను అర్హుడిని కాదంటే కనుక, ‘గాంధీభవన్ లో లీడర్ గా పనిచెయ్యను అటెండర్ గా పనిచేస్తాను. ఇలాంటి దొంగలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు. ఈ ఆడియో టేపు గురించి రాష్ట్ర నాయకత్వానికి చెబితే ‘చూద్దాం.. మాట్లాడదాం అన్నారు’. స్క్రీనింగ్ కమిటీలో భక్త చరణ్ దాస్ గారు నన్ను అడిగితే కరెక్టుగా సమాధానం చెప్పాను. బెదిరిస్తే బెదరనని అందరిముందే చెప్పాను. భక్తచరణ్ దాస్ నోరుమూసుకున్నాడు

నేను అబద్ధం చెబితే నన్ను ఉరితీయండి..ఉరేసుకుంటానని చెప్పాను. దమ్ముంటే సవాల్.. భక్త చరణ్ దాస్ కు, ఆయన్ని సమర్ధించే ఈ దొంగనాయకులను ఎవరినైనా రమ్మనమనండి. ఇది నిజం కాకపోతే, నన్ను ఉరితీయండి. ఇలాంటి దొంగలు పార్టీ నుంచి వెళ్లిపోతేనే స్వచ్ఛమైన కాంగ్రెస్ బతుకుతుంది. స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్..24 అక్బర్ రోడ్డుకే పరిమితమైంది. కింద అంతా దొంగలు..’ అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వీళ్లయ్య జాగీరు కాదు. ఈ కొడుకులు ఇవాళ ఉంటారు రేపు పోతారు. ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలకు వివరిస్తున్నా. రాహుల్, సోనియాలకు తెలియాలంటే పత్రికాముఖంగా వస్తేనే ఇదంతా తెలుస్తుంది’ అని అన్నారు.
Go Back to Shorts
t-congress
Ranga Reddy District
kyama mallesh

More Telugu News