Gutta sukendarreddy: మహాకూటమికి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని చంద్రబాబు చేతుల్లో పెట్టినట్లే : ఎంపీ సుఖేందర్రెడ్డి
మహకూటమికి అధికారాన్ని అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల్లో పెట్టినట్లేనని, అదే జరిగితే తెలంగాణ ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహా కూటమి నాయకులకు ఢిల్లీ, అమరావతి చుట్టూ తిరగడానికే సమయం సరిపోదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల మాయమాటలను ప్రజలు జాగరూకతతో గమనించాలని కోరారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే రూ.2 లక్షల రుణమాఫీ అని ప్రకటించారన్నారు. అసలు బ్యాంకుల్లో రూ.2 లక్షల రుణం తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్లో పదవుల కొట్లాట తప్ప మరొకటి లేదన్నారు. ఇందుకు రాంరెడ్డి దామోదరరెడ్డి యాగం చేయడమే ఓ ఉదాహరణ అన్నారు.