Chandrababu: అక్కడ కనిపించేది చంద్రబాబు బాహుబలి గ్రాఫిక్సే!: వైఎస్ జగన్ విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ వేదికగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ,‘వారం రోజుల కిందట సింగపూర్ లో అంతర్జాతీయ నగరాల సదస్సు జరిగింది. ఆశ్చర్యమేంటో తెలుసా! ఈ సదస్సుకు భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్.. ఇటువంటి మహానగరాల నుంచి ఏ సీఎం కానీ, ఏ వ్యక్తీ కాని అక్కడికి హాజరుకారు కానీ, మన చంద్రబాబునాయుడు గారిని మాత్రమే వాళ్లు పిలిచారట... ఈ పెద్ద మనిషిని మాత్రమే వాళ్లు సింగపూర్ కు పిలిచారట. కట్టని అమరావతి గురించి..కనపడని అమరావతి గురించి ఈయన కోతలు కూస్తూ ఉంటే.. అక్కడ ఉన్న సింగపూర్ వాళ్లు, దుబాయ్ వాళ్లు, షాంఘై వాళ్లు.. ఇలాంటి నగరాల వాళ్లందరు కూడా ఇక తమ నగరాల్లో వాళ్లందరూ ఉండటం వేస్ట్. అమరావతికి వెళ్లిపోవాలన్నట్టుగా చంద్రబాబునాయుడుగారు బిల్డప్ ఇచ్చారు.

కట్టని అమరావతి గురించి, కనపడని అమరావతి గురించి చంద్రబాబునాయుడు గారు అక్కడ ఏ లెవెల్లో కోతలు కోశారో తెలుసా! అమరావతిలో ఉద్యోగస్తులు నడుచుకుంటూ పదిహేను నిమిషాల్లో తమ ఆఫీసులకు వెళ్లిపోవచ్చట. కట్టని అమరావతి అద్భుతమైన గార్డెన్ సిటీ అట. అమరావతిలో 180 కిలోమీటర్ల మేరకు రవాణాకు వీలైన కాలువలు ఉన్నాయట. అమరావతిలో వాడే వాహనాలన్నీ ఎలక్ట్రికల్ వాహనాలట.. ఇలా ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారు సింగపూర్ కు వెళ్లి కోతలు కోశారు’ అని విమర్శలు గుప్పించారు. ‘అమరావతికి వెళ్లి మనం చూస్తే ఏం కనిపిస్తాయో తెలుసా! చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేల గేదెలు గడ్డి మేస్తూ కనిపిస్తాయి. అమరావతిలో ఏం కనిపిస్తాయో తెలుసా! చంద్రబాబు నాయుడి గారి బాహుబలి గ్రాఫిక్స్ కనిపిస్తాయి.. అమరావతిలో ఏం కనిపిస్తాయో తెలుసా.. చంద్రబాబునాయుడి గారి గిమ్మిక్స్’ అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
Go Back to Shorts
Chandrababu
jagan

More Telugu News