ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిప్పులు చెరిగిన భారత్

  • టెర్రరిస్టులకు చట్టబద్ధత కలిగించేలా వ్యవహరిస్తున్నారు
  • తీవ్రవాదులు కశ్మీర్ లో నెత్తుటి ఏర్లు పారేలా చేస్తున్నారు
  • ఎవరి ప్రోద్బలంతోనో మానవహక్కుల నివేదికను తయారు చేశారు
జెనీవాలో ఈరోజు జరిగిన ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో జర్నలిస్ట్ షుజాత్ భుకారీ, జవాన్ ఔరంగజేబ్ ల హత్యలను భారత్ లేవనెత్తింది. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో మానవహక్కుల హననం గురించి ఐక్యరాజ్యసమితి నివేదికను ఎండగట్టింది.

 పొరుగు దేశం నుంచి వస్తున్న తీవ్రవాదులు జమ్ముకశ్మీర్ లో నెత్తుటి ఏర్లు పారేలా చేస్తున్నారని మండిపడింది. పవిత్రమైన ఈద్ సమయంలోనే వీరిద్దరినీ దారుణంగా హత్య చేశారని తెలిపింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ లో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ చందర్ మాట్లాడుతూ, ఐరాస నివేదిక ఎవరి ప్రోద్బలంతోనే తయారుచేసిందని ఆరోపించారు. జరుగుతున్న దారుణాలను పరిగణనలోకి తీసుకోకుండానే నివేదికను ఏకపక్షంగా తయారు చేశారని విమర్శించారు.

టెర్రరిజానికి చట్టబద్ధత కల్పించేలా ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ వ్యవహరిస్తోందని భారత్ మండిపడింది. ఇలాంటి చర్యల వల్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలిపింది. కశ్మీర్ లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉందని... రాజ్యాంగాన్ని ఆ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పింది. 
Go Back to Shorts
un
human rights counsil
india
terrorists
Jammu And Kashmir

More Telugu News