Telugudesam: మిత్ర ధర్మమంటే ఏంటో బీజేపీకి తెలుసా? : ఎంపీ రామ్మోహన్ నాయుడు
బీజేపీకి మిత్రధర్మమంటే ఏంటో తెలుసా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగు వారి ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, టీడీపీపై విమర్శలు చేస్తున్న వారి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే రైల్వే జోన్ పై బీజేపీ నాటకాలాడుతోందని, సీఎం చంద్రబాబుకు అమిత్ షా రాసిన లేఖ తెలుగువారిని అవహేళన చేసేలా ఉందని మండిపడ్డారు.మిత్ర ధర్మాన్ని పాటించింది టీడీపీ ఒక్కటేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఐక్యత లేకపోవడం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘అవిశ్వాసం’పై బీజేపీ రాజకీయాలు చేస్తోందని, భారతీయ జనతా పార్టీకి ధైర్యం ఉంటే అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలని రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు.