మాధురీ దీక్షిత్‌కి జాన్వీ కపూర్ కృతజ్ఞతలు...!

  • కరణ్ జోహార్ చిత్రంలో తొలుత తన తల్లికే ఆఫర్ వచ్చిందని వెల్లడి
  • ఆ పాత్ర తన తల్లి హృదయానికి చాలా దగ్గరగా ఉందని ప్రకటన
  • ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవి-మాధురీ ఫొటో అప్‌లోడ్ చేసిన 'దఢక్' హీరోయిన్
'దఢక్' చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్న అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ అందం మాధురీ దీక్షిత్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇందుకు ముఖ్యమైన కారణముంది. శ్రీదేవి బతికి ఉండుంటే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తలపెట్టిన 'షిద్దత్' సినిమాలో ఆమె నటించి ఉండేది. కానీ ఆమె హఠాత్తుగా మరణించడంతో ఆ పాత్ర ఇప్పుడు మాధురీ దీక్షిత్‌ని వరించింది. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో నటించేందుకు తొలుత తన అమ్మకే ఆఫర్ వచ్చిందని జాన్వీ తెలిపింది.

ఈ చిత్రం తన తల్లి హృదయానికి చాలా దగ్గరగా ఉందని ఆమె తెలిపింది. ఇందులో మాధురీజీ భాగమవుతున్నందుకు తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీతో పాటు తాను కూడా ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నానంది. ఈ వివరాలతో పాటు ఓ డాన్స్ రియాల్టీ షో సందర్భంగా మాధురీ, శ్రీదేవి ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, సాజిద్ నడియడ్ ‌వాలాతో కలిసి కరణ్ జోహార్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఆలియా భట్, వరుణ్ థావన్, ఆదిత్యా రాయ్ కపూర్ తదితరులు నటించనున్నారు.
Go Back to Shorts
Madhuri dixit
Sridevi
Janhvi kapoor
Boney kapoor
Shiddat
Karan Johar

More Telugu News