గాయాలు ఆటలో భాగమే.. మానసికంగా బలంగా ఉండాలి: నితీశ్‌ రెడ్డి

గాయాలు ఆటలో భాగమే.. మానసికంగా బలంగా ఉండాలి: నితీశ్‌ రెడ్డి

Nitish Reddy says injuries are part of the game and mental strength is key
  • ఆప్ఘన్‌పై ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన ఆల్‌రౌండర్‌
  • గాయం తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిందన్న నితీశ్‌
  • జట్టు మేనేజ్‌మెంట్‌ తనపై నమ్మకం ఉంచిందని వెల్లడి
  • సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో మానసిక అలసట ఎదురైందని వ్యాఖ్య
  • స్నేహితులు, కుటుంబంతో మాట్లాడటం ఉపశమనమిచ్చిందని వెల్లడి
గాయం నుంచి కోలుకుని భారత జట్టులోకి తిరిగొచ్చిన ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో టీ20లో అద్భుతంగా ఆడి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మూడు వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన నితీశ్‌.. గాయం తర్వాత ఆటలో నిలదొక్కుకోవడానికి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని చెప్పాడు.

రెండో టీ20లో నితీశ్‌ 24 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. అతడి బౌలింగ్‌తో భారత్‌ ఆఫ్ఘనిస్థాన్‌ను 159/8కే పరిమితం చేసింది. అనంతరం భారత్‌ ఏడు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది.

‘‘గాయం నుంచి తిరిగొచ్చిన ఆటగాడికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం. తొలి మ్యాచ్‌లో నా ప్రదర్శన అంత బాగోలేదు. రెండో మ్యాచ్‌లో మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వచ్చిన ఈ నమ్మకాన్ని ముందూ కొనసాగించాలి’’ అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో నితీశ్‌ చెప్పాడు.

గాయం నుంచి కోలుకునే సమయంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో చేసిన శ్రమను కూడా అతడు గుర్తుచేసుకున్నాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్‌ తనపై ఉంచిన నమ్మకం కూడా ఎంతో ఉపయోగపడిందని తెలిపాడు. జట్టులో చోటుపై ఆందోళన లేకుండా తన ఆటపై దృష్టిపెట్టేలా మేనేజ్‌మెంట్‌ అవకాశాలు ఇచ్చిందని చెప్పాడు.

అయితే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఎక్కువ కాలం ఉండటం మానసికంగా అలసటకు గురిచేసిందని నితీశ్‌ వెల్లడించాడు. ఆ సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం తనకు ఉపశమనం ఇచ్చిందని చెప్పాడు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి ఒకటి, రెండు రోజులు గడిపి తిరిగి వచ్చేవాడినని తెలిపాడు.

ఆల్‌రౌండర్‌గా తనపై పని భారం ఎక్కువగా ఉంటుందని నితీశ్‌ అన్నాడు. అందుకే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు గాయం ఎదురైనప్పుడు మానసికంగా కూడా బలంగా ఉండాలని చెప్పాడు. ‘‘గాయాలు ఆటలో భాగమే. అలాంటి సమయంలో ప్రతికూల ఆలోచనలకు చోటివ్వకూడదు. మానసికంగా సానుకూలంగా ఉండాలి. మంచి విషయాలపై దృష్టిపెడితే సరైన సమయంలో మంచి ఫలితం వస్తుంది’’ అని పేర్కొన్నాడు.
Advertisement
Nitish Kumar Reddy
India Afghanistan T20
Nitish Reddy 3 wickets
BCCI Center of Excellence
Indian Cricket Team
Player of the Match

More Telugu News