నార్నూర్, గాదిగూడ మండలాల అభివృద్ధికి కృషి చేయండి: ఆదిలాబాద్ కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
- ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కోవ లక్ష్మి
- ఇందిరమ్హ ఇళ్లు, పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
- అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరిన లక్ష్మి
ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని నార్నూర్, గాదిగూడ మండలాల అభివృద్ధికి మరియు స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె ఈరోజు నార్నూర్ మండలంలోని జామాడ, బలాన్పూర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు.
మండలాల్లోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ‘భూ భారతి’ కార్యక్రమంలో భాగంగా అర్హులైన రైతులకు కోవ లక్ష్మి భూ హక్కు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ... నార్నూర్, గాదిగూడ మండలాల్లో నెలకొన్న ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెస్రం చందుర్ షావ్, తహసీల్దార్ జాడి రాజాలింగం, డీఎల్పీఓ ప్రభాకర్, ఎంపీడీవో పుల్లారావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి ఆకాశ్, సీడీపీఓ శారద, ఎంఈఓ మనోహర్ తదితరులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.