'బ్రిక్స్' వెజ్ మెనూపై చర్చ.. రాహుల్ విమర్శకు హర్ష్ గోయెంకా కౌంటర్

'బ్రిక్స్' వెజ్ మెనూపై చర్చ.. రాహుల్ విమర్శకు హర్ష్ గోయెంకా కౌంటర్

BRICS veg menu debate Harsh Goenka counters Rahul Gandhis criticism
  • బ్రిక్స్ విందులో పూర్తి శాకాహార మెనూపై సోషల్ మీడియాలో చర్చ
  • ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
  • భారత శాకాహార వంటకాలను ప్రదర్శించడాన్ని సమర్థించిన హర్ష్ గోయెంకా
  • మెనూలో ఖాండ్వీ, గుచి, పొరియల్ వంటి ప్రత్యేక వంటకాలు ఉన్నాయన్న గోయెంకా
  • ఆ విందుకు వెళ్లే అవకాశం వస్తే బాగుండేదని వ్యాఖ్య
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రముఖులకు ఇచ్చిన విందులో కేవలం శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించడంపై జరుగుతున్న చర్చపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు. భారతీయ శాకాహార వంటకాల విశిష్టతను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడాన్ని ఆయన గట్టిగా సమర్థించారు.

భారతదేశంలో ప్రపంచంలోనే అత్యుత్తమ శాకాహార వంటకాలు ఉన్నాయని, వాటిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఎలాంటి తప్పులేదని హర్ష్ గోయెంకా అభిప్రాయపడ్డారు. ఆ విందులో వడ్డించింది సాధారణ భోజనం కాదని, గుజరాత్‌కు చెందిన ఖాండ్వీ, అవధ్ ప్రాంతపు మష్రూమ్ గలౌటీ, కాశ్మీర్ ప్రత్యేకత అయిన గుచి, దక్షిణాది పొరియల్ వంటి ఎన్నో వైవిధ్యమైన వంటకాలు అందులో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. వీటితో పాటు పాత ఢిల్లీ శైలిలోని ఫ్రూట్ క్రీమ్, జిలేబీ వంటి డెజర్ట్‌లు సైతం మెనూలో భాగమని వివరించారు.

అంతకుముందు, ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలో దాదాపు 80 శాతం మంది మాంసాహారులు ఉన్నారని, అత్యంత రుచికరమైన భారతీయ మాంసాహార వంటకాలను విస్మరించి, కేవలం శాకాహారానికే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ విమర్శల నేపథ్యంలో హర్ష్ గోయెంకా స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత విశిష్టమైన వంటకాలతో కూడిన ఆ విందుకు హాజరయ్యే అవకాశం తనకు లభించి ఉంటే ఎంతో బాగుండేదని హర్ష్ గోయెంకా తన పోస్టులో పేర్కొన్నారు.
Advertisement
Harsh Goenka
BRICS Summit Menu
Rahul Gandhi
Indian Vegetarian Food
BRICS Dinner Controversy

More Telugu News