బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు.. మరి మిస్‌ ఇంగ్లాండ్‌ వ్యవహారం ఏమైంది?: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు.. మరి మిస్‌ ఇంగ్లాండ్‌ వ్యవహారం ఏమైంది?: కేటీఆర్‌

KTR asks telangana police on the progress of miss world case
  • బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులపై కేటీఆర్‌ స్పందన
  • కేసులను కోర్టుల్లో ఎదుర్కొంటామని వెల్లడి
  • మిస్‌ ఇంగ్లాండ్‌ ఆరోపణలపై డీజీపీకి ప్రశ్న
  • తెలంగాణ పోలీసులు నిందితులను కాపాడుతున్నారా? అని నిలదీత
  • మిల్లా మ్యాగీ ఆరోపణలతో గతంలో రాజకీయ దుమారం
అసెంబ్లీ ప్రాంగణంలో ఇటీవల జరిగిన గందరగోళం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఈ కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని చెప్పారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన మిస్‌ వరల్డ్‌ పోటీల సందర్భంగా మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారని రాష్ట్ర డీజీపీని ప్రశ్నించారు.

‘‘ఈ చెత్త కేసును మేం కోర్టుల్లో ఎదుర్కొంటాం. కానీ హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీల సమయంలో మిస్‌ ఇంగ్లాండ్‌తో అభ్యంతరకరంగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ నాయకులపై ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఏమయ్యాయి?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. నిందితులను తెలంగాణ పోలీసులు ఇంకా కాపాడుతున్నారా? దీనిపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ వద్ద సమాధానం ఉందా? అని నిలదీశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

అసెంబ్లీ గేటు ముందు జరిగిన గందరగోళం నేపథ్యంలో ముఖ్యమంత్రి తన పోలీసులతో బీఆర్‌ఎస్‌ నేతలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని కేటీఆర్‌ ఆరోపించారు.

2025లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ వేదికగా మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహించింది. ఈ పోటీలపై మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌పై ఆరోపించారు. ‘‘మేం పోటీలకు వచ్చామో, దేనికి వచ్చామో అర్థం కాలేదు. ఇవేం పోటీలు?’’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తనకు ఎదురైన అసౌకర్యంతో మిస్‌ వరల్డ్‌ 2025 పోటీల నుంచి మ్యాగీ అర్థాంతరంగా వైదొలిగి ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారానికి దారితీశాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాగీ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం సైతం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలపై కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు.
Advertisement
KTR
BRS
TELANGANA

More Telugu News