కేసీఆర్‌కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారు: మహేశ్‌ గౌడ్‌

కేసీఆర్‌కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారు: మహేశ్‌ గౌడ్‌

KCR family members want bad things to happen to him says Mahesh Goud
  • కేసీఆర్‌కు హాని జరగాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కోరుకోలేదన్న మహేశ్‌ గౌడ్‌
  • కేసీఆర్‌ గతంలో గాయపడినప్పుడు సీఎం రేవంత్‌ వెంటనే స్పందించారని వెల్లడి
  • కేసీఆర్‌కు రాష్ట్రంలో అత్యధిక భద్రత ఉందని వివరణ
  • సిరిసిల్లలో సీఎం రేవంత్‌కు పిండ ప్రదానంపై మహేశ్‌ గౌడ్‌ ప్రశ్నలు
  • హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని కవిత మాట్లాడిన వీడియోలు ఉన్నాయని వ్యాఖ్య
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హాని జరగాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడూ కోరుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌ కుమార్‌ గౌడ్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలే సీఎం రేవంత్‌ రెడ్డి పట్ల అనుచితంగా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బుధవారం మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. కేసీఆర్‌ గతంలో బాత్‌రూమ్‌లో జారిపడినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించారని చెప్పారు. అర్ధరాత్రి గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారని తెలిపారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడు సీఎం స్వయంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. సీఎం తర్వాత రాష్ట్రంలో అత్యధిక భద్రత పొందుతున్న వ్యక్తి కేసీఆర్‌ అని పేర్కొన్నారు.

సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేతలు పిండ ప్రదానం చేయడం ఎంతవరకు సమంజసమని మహేశ్‌ గౌడ్‌ ప్రశ్నించారు. స్పీకర్‌ పదవిపై బీఆర్‌ఎస్‌ నేత తాతా మధు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేతల దిగజారుడు రాజకీయాలను తెలంగాణ సమాజం ఖండిస్తోందన్నారు.

కేసీఆర్‌ ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు చెడు జరగాలని ఆయన సొంత కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని కవిత మాట్లాడిన వీడియోలు ఉన్నాయని చెప్పారు.

కేసీఆర్‌పై కాంగ్రెస్‌కు గౌరవం ఉందని మహేశ్‌ గౌడ్‌ అన్నారు. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. దళితులు, బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Advertisement
K Chandrashekar Rao
Mahesh Kumar Goud
TPCC President
Revanth Reddy
BRS Party Telangana
Telangana Politics

More Telugu News