సెప్టెంబర్ 9 ఒక చీకటి రోజు.. ఆ కుట్ర వల్లే వైసీపీ పతనం: చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ

సెప్టెంబర్ 9 ఒక చీకటి రోజు.. ఆ కుట్ర వల్లే వైసీపీ పతనం: చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ

Panchumarthi Anuradha says truth won after Chandrababu Naidu illegal arrest anniversary
  • చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తి 
  • ఈ సందర్భంగా వైసీపీపై శాసనమండలి చీఫ్‌ విప్‌ విమర్శలు
  • రాజకీయ కక్షతోనే విజనరీ నేతపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపణ
  • ఆ కష్టకాలంలో లోకేశ్‌, భువనేశ్వరిల పోరాటం మరువలేనిదన్న‌ అనురాధ
  • అంతిమంగా నిజమే గెలిచిందని స్పష్టీకరణ
  • ప్రజలు తిరస్కరించినా వైసీపీ నేతల తీరు మారలేదని మండిపాటు
ఐదు దశాబ్దాల మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబును నాటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన సెప్టెంబర్ 9వ తేదీ తెలుగు ప్రజల చరిత్రలో ఒక చీకటి రోజని శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ అభివర్ణించారు. ఆ అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నాడు రాజకీయ కక్షతో చంద్రబాబును జైలుకు పంపిన జగన్ కు, ప్రజలు తమ తీర్పుతో గట్టిగా బుద్ధి చెప్పారని, 164 స్థానాల్లో కూటమిని గెలిపించి చంద్రబాబు నాయకత్వానికి పట్టం కట్టారని అన్నారు.

రాజకీయ కక్షతోనే కుట్రపూరిత అరెస్ట్
ఆనాడు నంద్యాలలో పార్టీ కార్యక్రమం కోసం వెళ్లిన చంద్రబాబు బస చేసిన బస్సు తలుపులు అర్ధరాత్రి బాది, ఎలాంటి కారణం లేకుండా తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారని అనురాధ మండిపడ్డారు. జగన్ ఆదేశాలతో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. 

"31 క్రిమినల్ కేసుల్లో ఉంటూ, రూ.43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, తాను జైలుకు వెళ్లాను కాబట్టి చంద్రబాబును కూడా పంపాలనే కుంచిత బుద్ధితో ఈ కుట్ర చేశారు. అధికారం కోసం కన్నతల్లిని, తోబుట్టువును సైతం రోడ్డున పడేసిన సంస్కృతి వారిది. చంద్రబాబు లాంటి విజనరీకి, జగన్ కు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది" అని ఆమె దుయ్యబట్టారు.

కష్టకాలంలో అండగా నిలిచిన నారా కుటుంబం
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతికి గురైన ఆ క్లిష్ట సమయంలో నారా కుటుంబం చూపిన ధైర్యం మరువలేనిదని అనురాధ కొనియాడారు. తండ్రి అరెస్టు వార్త వినగానే యువనేత నారా లోకేశ్‌ తన పాదయాత్రను నిలిపివేసి, ఒకవైపు కార్యకర్తలకు ధైర్యం చెబుతూనే ఢిల్లీ స్థాయిలో న్యాయపోరాటం చేశారని గుర్తుచేశారు. మరోవైపు, భువనేశ్వరి, బ్రాహ్మణి గారు చిన్నారి దేవాన్ష్‌ను వదిలి రాజమండ్రికి వచ్చారని, చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర చేపట్టారని తెలిపారు. 53 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదలైనప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఆ క్షణమే వైసీపీ పతనం ప్రారంభమైందని ఆమె స్పష్టం చేశారు.

ప్రజాతీర్పు, న్యాయస్థానం క్లీన్‌చిట్‌తో నిజం గెలిచింది
వైసీపీ ప్రభుత్వ అరాచకాలను చూసే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లకు పరిమితం చేశారని అనురాధ ఎద్దేవా చేశారు. రూ.700 కోట్ల ప్రజాధనంతో శ్మశానాల్లోని సమాధులపై కూడా జగన్ తన ఫొటోలు వేయించుకున్నారని విమర్శించారు. నేడు న్యాయస్థానం ఈ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడంతో అంతిమంగా నిజమే గెలిచిందని, నిజానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం వీడి సిగ్గుతో తలదించుకోవాలని హితవు పలికారు. ప్రజలు తిరస్కరించినా, కోర్టులు మొట్టికాయలు వేసినా వైసీపీ నేతల బుద్ధి మారలేదని, డీఎస్సీని అడ్డుకోవాలని చూసి కోర్టులో అక్షింతలు వేయించుకున్నారని విమర్శించారు. అనవసర రాద్ధాంతాలు మాని, ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఆమె సూచించారు.
Advertisement
Panchumarthi Anuradha
Chandrababu Naidu
Nara Lokesh
TDP
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics

More Telugu News