ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై వేసిన సస్పెన్షన్ వేటు: హరీశ్ రావు
- అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్
- బీఆర్ఎస్ సభ్యులను కక్షపూరితంగా సస్పెండ్ చేశారన్న హరీశ్
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే భయంతోనే కుట్రలు చేస్తున్నారని మండిపాటు
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సస్పెన్షన్ కు గురైన తర్వాత మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేసిన వేటు కాదని, తెలంగాణ ప్రజల సమస్యలపై చేసిన సస్పెన్షన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కక్షపూరితంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
"ప్రజలేమో 'మా సమస్యలపై మాట్లాడండి' అని అడుగుతుంటే... రేవంత్ రెడ్డి మాత్రం 'సభ నుంచి బీఆర్ఎస్ను బయటకు తోసేయండి' అని మార్షల్స్ను ఆదేశిస్తున్నారు" అని హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే భయంతోనే ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని ఆయన హెచ్చరించారు.