రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!

రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!

Signal cut while watching reels woman commits suicide in distress
  • ఛత్తీస్‌గఢ్‌ కోర్బా జిల్లాలో ఘటన
  • ఇంటర్నెట్ పదేపదే నిలిచిపోవడంతో ఫోన్‌ను విసిరికొట్టిన మహిళ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఒక విచిత్రమైన, విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తుండగా ఇంటర్నెట్ సిగ్నల్ పదేపదే నిలిచిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం, కోర్బా జిల్లాలోని కేరకఛార్ గ్రామానికి చెందిన మంగ్లో బాయి సారథి (52) ఈ దారుణానికి పాల్పడింది. ఈ నెల 5న పురుగుల మందు తాగిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలికి ఫోన్‌లో రీల్స్, టీవీ సీరియల్స్ చూసే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

శనివారం మధ్యాహ్నం భోజనం చేస్తూ వీడియోలు చూస్తుండగా, నెట్‌వర్క్ సమస్యతో అవి మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె ఫోన్‌ను నేలకేసి కొట్టి, గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కొంతసేపటి తర్వాత ఆమె బయటకు వచ్చి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. గదిలో పురుగుల మందు డబ్బా ఖాళీగా కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

వెంటనే ఆమెను మొదట స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి కోర్బాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. కేవలం నెట్‌వర్క్ సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమా? లేక ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Manglo Bai Sarathi
Chhattisgarh woman suicide
Mobile reels addiction
Korba district suicide case
Internet signal frustration
Mobile network issues death

More Telugu News