ఫోన్‌ స్క్రీన్‌ ఫ్రీజ్‌ అవుతోందా? యూపీఐ మోసం కావొచ్చు

ఫోన్‌ స్క్రీన్‌ ఫ్రీజ్‌ అవుతోందా? యూపీఐ మోసం కావొచ్చు

UPI Fraud Alert Phone screen freezing could be a sign of cybercrime
  • ఫోన్‌ స్క్రీన్‌ ఫ్రీజ్‌ పేరుతో కొత్త సైబర్‌ మోసాలు
  • నకిలీ కస్టమర్‌ కేర్‌ కాల్స్‌తో బాధితులను నమ్మిస్తున్న వైనం
  • రివార్డు, వెరిఫికేషన్‌ పేరుతో ఏపీకే యాప్‌లు ఇన్‌స్టాల్‌
  • ఎస్‌ఎంఎస్‌, నోటిఫికేషన్‌ అనుమతులతో ఓటీపీలు తస్కరించే ప్రమాదం
  • స్క్రీన్‌ షేరింగ్‌తో యూపీఐ లావాదేవీలను గమనిస్తున్న నేరగాళ్లు
ఫోన్‌ ఒక్కసారిగా హ్యాంగ్‌ అవ్వడం.. స్క్రీన్‌ కదలకపోవడం.. వెంటనే టెక్నికల్‌ సమస్య అనుకుంటాం. కానీ ఇదే ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లకు కొత్త అస్త్రంగా మారుతోంది. సోషల్‌ మీడియా ప్రకటనలు, గుర్తుతెలియని లింకుల ద్వారా ఫోన్‌లోకి చొరబడిన మాల్‌వేర్‌ స్క్రీన్‌ను ఫ్రీజ్‌ చేసినట్లు చూపించి వినియోగదారుల్లో ఆందోళన పెంచుతోంది.

భయపెట్టి బుట్టలోకి..
స్క్రీన్‌ సమస్యను చూపించిన తర్వాత నేరగాళ్లు కస్టమర్‌ కేర్‌ సిబ్బందిలా ఫోన్‌ చేస్తున్నారు. ఫోన్‌, బ్యాంకింగ్‌ యాప్‌ లేదా యూపీఐలో సమస్య వచ్చిందని చెబుతున్నారు. పరిష్కారం పేరుతో రివార్డు, క్యాష్‌బ్యాక్‌, వెరిఫికేషన్‌ యాప్‌ అంటూ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు.

అనుమతులతో అసలు ముప్పు
ఆ యాప్‌కు ఎస్‌ఎంఎస్‌, కాల్స్‌, నోటిఫికేషన్లు, యాక్సెసిబిలిటీ వంటి అనుమతులు ఇస్తే ప్రమాదం పెరుగుతుంది. ఓటీపీలు, బ్యాంకింగ్‌ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్క్రీన్‌పై జరిగే పనులను గమనించడంతో పాటు కొన్ని సందర్భాల్లో వినియోగదారు తరఫున యాక్షన్స్‌ కూడా చేసే అవకాశం ఉంది.

యూపీఐని కాదు.. ఫోన్‌నే టార్గెట్‌
సైబర్‌ నేరగాళ్లు యూపీఐ భద్రతను నేరుగా ఛేదించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, యూపీఐ పిన్‌ వంటి కీలక అంశాలపై పట్టు సాధిస్తే సరిపోతుంది. స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లతో బాధితుడి కార్యకలాపాలను ప్రత్యక్షంగా గమనించొచ్చు. కొన్ని సందర్భాల్లో బాధితుడే తన యూపీఐ పిన్‌ నమోదు చేసేలా మోసగాళ్లు నమ్మిస్తారు.

ఫ్రీజ్‌ అయితే ఏం చేయాలి?
అనుమానాస్పదంగా స్క్రీన్‌ ఫ్రీజ్‌ అయితే వెంటనే మొబైల్‌ డేటా, వై-ఫై ఆపేయాలి. బ్యాంకింగ్‌ వివరాలు, యూపీఐ పిన్‌ నమోదు చేయకూడదు. గుర్తుతెలియని వ్యక్తుల సూచనలు పాటించకూడదు. అనుమానాస్పద యాప్‌లను తొలగించాలి. వాటికి ఇచ్చిన యాక్సెసిబిలిటీ, డివైజ్‌ అడ్మిన్‌ అనుమతులను రద్దు చేయాలి.

బ్యాంకు సమాచారం బయటకు వెళ్లిన అనుమానం ఉంటే అధికారిక నంబర్‌ ద్వారా బ్యాంకును సంప్రదించాలి. లావాదేవీలను వెంటనే పరిశీలించాలి. అవసరమైతే సురక్షితమైన మరో ఫోన్‌ నుంచి పాస్‌వర్డ్‌లు మార్చాలి. ఆర్థిక మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి.

బ్యాంకు లేదా విశ్వసనీయ సేవా సంస్థ సాధారణ సమస్య పరిష్కారం కోసం రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయమని అడగదు. స్క్రీన్‌ షేర్‌ చేయమని కూడా కోరదు.
Advertisement
UPI Fraud
Mobile Screen Freeze
Cybercrime
Malware APK
Digital Banking Safety
Screen Sharing Scams

More Telugu News