గ్లోబల్ లీడర్లలో మోదీ అత్యంత స్ఫూర్తిదాయకం: బెల్జియం ప్రధాని ప్రశంసల వర్షం
- మోదీ తెలివైన నాయకుడన్న బార్ట్ డె వెవర్
- మోదీతో భేటీ కావడం తనకు లభించిన గౌరవమని వ్యాఖ్య
- విశ్వవేదికపై భారత్ పాత్ర కీలకంగా మారిందన్న బెల్జియం ప్రధాని
ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రధాని మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానాలు, నాయకత్వ పటిమపై బెల్జియం ప్రధాని బార్ట్ డె వెవర్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన, తెలివైన నేతల్లో మోదీ అగ్రగామి అని అభివర్ణించిన ఆయన... మోదీతో భేటీ కావడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని పలువురు అగ్రనేతల ప్రసంగాలు విన్నప్పుడు ఆందోళన, అభద్రతా భావం కలుగుతాయని... కానీ ప్రధాని మోదీ మాట్లాడితే ఆయన చెప్పిన దార్శనికతను అనుసరించాలనే నమ్మకం, స్ఫూర్తి కలుగుతాయని వ్యాఖ్యానించారు.
విశ్వవేదికపై భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని కొనియాడిన బెల్జియం ప్రధాని... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ను బెల్జియం ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, టారిఫ్లపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని అస్థిరత వల్ల ప్రపంచ వాణిజ్యమే ప్రమాదంలో పడుతుందని... స్వేచ్ఛా వాణిజ్యం, బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాల ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.