రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
- నిన్న ఉదయం నుంచి లోకనాథం, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు
- బంగారం, వెండి, విలువైన స్థలాలు గుర్తింపు
- ఈరోజు సోదాలు ముగిసిన వెంటనే అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
నిన్న ఉదయం నుంచే తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ విస్తృత సోదాలు నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ తనిఖీల్లో దాదాపు రూ. 5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తనిఖీల సమయంలో ఆయన నివాసంలో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ. 12.50 లక్షల ద్రవ్య నగదును స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు ఆయన భార్య, కుమారుడి పేర్లతో పలుచోట్ల ఇళ్లు, విలువైన స్థలాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిన్న ప్రారంభమైన సోదాలు ముగిసిన వెంటనే, ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు. టీటీడీ కీలక అధికారిని ఏసీబీ అరెస్ట్ చేయడం ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది.