Advertisement

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్... ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

Chandrababu Naidu Good News for AP Women Free Travel in AC Buses
  • త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటన
  • సంక్షేమంతో పాటు అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం
  • మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ 350 కేసులు వేసిందని విమర్శ
  • ఇప్పటివరకు పింఛన్ల రూపంలో రూ.73,000 కోట్లు అందించామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్న ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. మొగల్తూరులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు పింఛన్ల రూపంలోనే ప్రజలకు రూ. 73,000 కోట్లు అందించినట్లు గుర్తుచేశారు. మహిళలు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి కష్టాలను తీర్చేందుకే 'దీపం' పథకాన్ని తీసుకువచ్చామని వివరించారు.

ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెగా డీఎస్సీని అడ్డుకోవాలనే లక్ష్యంతో ఏకంగా 350 కేసులు వేశారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అభివృద్ధిని ఆపలేరని హితవు పలికారు. కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి పార్టీలు ఏకమయ్యాయని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh
Free Bus Travel for Women
APSRTC AC Buses
NTR Bharosa Scheme
Deepam Scheme

More Telugu News