Advertisement

ఒక్కరి దానం.. వేలమందికి నీడనిచ్చే మహావృక్షం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh One persons donation is like a great tree providing shade to thousands
  • విశాఖ జిల్లాలో నారా లోకేశ్ ప్యటన
  • హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి
  • హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ
  • ప్రేమ గ్రూప్ ఇన్‌స్టిట్యూషన్స్ నూతన కాలేజీ భవనం ప్రారంభం
  • జెరియాట్రిక్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్‌కు ప్రారంభోత్సవం
"ఒక వ్యక్తి చేసిన దానం.. నేడు వేల మందికి నీడనిచ్చే మహావృక్షంగా మారింది. సివిల్ సొసైటీ, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ ప్రాంగణమే ఒక చక్కటి ఉదాహరణ" అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ఆయన పలు సేవా, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రేమ గ్రూప్ ఇన్‌స్టిట్యూషన్స్ నూతన కాలేజీ భవనాన్ని, ఏజ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం సంస్థకు సహకరిస్తున్న ముఖ్య దాతలతో బోర్డ్‌రూమ్ సమావేశంలో పాల్గొన్నారు.

సేవే పరమావధిగా సాగిన జీవితం
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. దివంగత 'పద్మశ్రీ' డాక్టర్ ఎస్.వి. ఆదినారాయణరావు గారు, వారి కుటుంబం సమాజ సేవ కోసం ఆరు ఎకరాల భూమిని కేటాయించడం ఎంతో అభినందనీయమన్నారు. ఆ భూమిలో నేడు కాలేజీ, హరేకృష్ణ మిషన్ ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమం, వృద్ధుల సంరక్షణ కేంద్రం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కొనియాడారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో, వృద్ధుల కోసం అత్యాధునిక కేర్ సెంటర్ నిర్మించడం గొప్ప విషయమని ప్రశంసించారు.

విలువలతో కూడిన విద్యే లక్ష్యం
"విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా, విలువలు, నైతికతతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత నాపై ఉంది. 'అమ్మకి చెప్పలేని పని ఏదీ చేయొద్దు' అనే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాట ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి. అందుకే ఆయనకు కేబినెట్ హోదాతో సలహాదారు బాధ్యతలు అప్పగించాం. ఆయన సూచనలతో ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన పుస్తకాలను అందిస్తాం" అని లోకేశ్ వివరించారు. వృద్ధులు గౌరవంగా జీవించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి రూ.4,000 పెన్షన్ అందిస్తున్నారని గుర్తు చేశారు.

విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. "రాష్ట్ర విభజన తర్వాత విశాఖ అభివృద్ధి మనందరి బాధ్యత. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను దేశంలోనే తొలి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారుస్తాం. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో విశాఖను దేశంలోనే నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేసిన తరహాలోనే విశాఖ అభివృద్ధిలోనూ కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తామని అన్నారు.

అపోహలు వద్దు.. పర్యావరణ పరిరక్షణే ముఖ్యం
అభివృద్ధి విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని లోకేశ్ అన్నారు. "ప్రజల ప్రయోజనాలకు, ప్రకృతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టదు. డేటా సెంటర్ల విషయంలో కొన్ని అపోహలున్నాయి. నేను వ్యక్తిగతంగా ఇంటెల్ డేటా సెంటర్‌ను పరిశీలించాను. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లలో నీటి వినియోగాన్ని తగ్గించే ఎయిర్ కూలింగ్ వంటి ఆధునిక సాంకేతికతలకు ప్రాధాన్యం ఇస్తాం" అని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని చెప్పడం లేదని, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, అవసరమైన చోట సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణు కుమార్ రాజు,  ఫౌండేషన్ ఛైర్మన్ రొక్కమ్ శశి ప్రభ, హరే కృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు నిస్కించన భక్త దాస తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Visakhapatnam
Hare Krishna Movement
Value Based Education
Age Care Foundation
Vizag Development

More Telugu News