Advertisement

ఆంధ్రా అబ్బాయితో అమెరికాలో కుమార్తె పెళ్లి.. ఆన్‌లైన్‌లో అక్షింతలు చల్లారు!

Daughters wedding in USA with Andhra boy parents bless online
  • అమెరికాలో జరిగిన కూతురి పెళ్లికి వీసా సమస్యలతో హాజరు కాలేకపోయిన తల్లిదండ్రులు
  • సూర్యాపేట జిల్లాకు చెందిన హిమబిందు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్‌ల వివాహం
  • వీడియో కాల్ ద్వారా నూతన వధూవరులను ఆశీర్వదించిన జయరాజు, జ్యోతి దంపతులు
  • బంధుమిత్రులు, గ్రామస్థుల కోసం స్వగ్రామంలో ఘనంగా విందు ఏర్పాటు
కన్నకూతురి వివాహాన్ని కళ్లారా చూసి, అక్షింతలు వేసి ఆశీర్వదించాలని ప్రతి తల్లిదండ్రులూ కలలు కంటారు. కానీ, కొన్నిసార్లు దూరాలు అడ్డుగోడలుగా నిలుస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వీసా సమస్యల కారణంగా అమెరికాలో జరిగిన తమ ఏకైక కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయిన తల్లిదండ్రులు, వీడియో కాల్ ద్వారానే వేడుకను వీక్షించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె హిమబిందు. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ అమెరికాలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించాలని భావించిన జయరాజు, జ్యోతి దంపతులు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, వీసా సంబంధిత సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం చివరి నిమిషంలో ఆగిపోయింది. దీంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ, టెక్నాలజీ సాయంతో వారు తమ కుమార్తె వివాహ వేడుకలో పాలుపంచుకున్నారు.

అమెరికాలో హిమబిందు, రోహిత్‌ల వివాహం జరుగుతుండగా, ఇక్కడ స్వగ్రామంలోని తమ నివాసం నుంచి తల్లిదండ్రులు వీడియో కాల్ ద్వారా వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు. కళ్లారా కూతురి పెళ్లిని చూడలేకపోయామన్న బాధ ఉన్నప్పటికీ, ఆన్‌లైన్‌లోనే నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. అంతేకాకుండా, బంధుమిత్రులు, గ్రామస్థుల కోసం తమ గ్రామంలో ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ ఘటన స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
Advertisement
Himabindu
USA Wedding
Suryapet
Visa Issues
Video Call Marriage
Rohith Wedding

More Telugu News