నేడు అరకులో సీఎం చంద్రబాబు పర్యటన.. 'సంజీవని' ప్రాజెక్టుకు శ్రీకారం

Chandrababu Naidu to launch Sanjeevani project in Araku today
  • గన్నెల గ్రామంలో 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
  • ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం
  • పర్యటనలో భాగంగా ప్రజావేదికలో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (శనివారం) అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును ఆయన అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పర్యటన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నెల గ్రామానికి చేరుకుంటారు. తొలుత గ్రామానికి సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఓ గిరిజన కుటుంబాన్ని సందర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) ‘సంజీవని’ ప్రాజెక్టును ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన 'ప్రజావేదిక' బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతోనూ సీఎం సమావేశం కానున్నారు. కార్యక్రమాలన్నీ ముగిసిన అనంతరం ఆయన తిరిగి హెలికాప్టర్‌లో నేరుగా ఉండవల్లికి బయలుదేరుతారు.                                
Advertisement
Chandrababu Naidu
Sanjeevani Project
Araku Valley
Andhra Pradesh Healthcare
Alluri Sitharama Raju District
Gannela Village

More Telugu News