డబ్బుతో గెలవాలని చూసేవారికి ఓటమి తప్పదు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says defeat is certain for those who want to win with money
  • టీడీపీ శిక్షణా తరగతుల ట్రైనర్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ‘గొడ్డలి పార్టీ’ దుష్ప్రచారాన్ని కార్యకర్తలే తిప్పికొట్టాలని పిలుపు
  • రాష్ట్రంలో గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్న సీఎం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం
  • పదవులు తీసుకుని పనిచేయని వారిని తప్పిస్తామని హెచ్చరిక
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ శిక్షణా తరగతుల ట్రైనర్స్‌తో సమావేశమై వారికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. అనంతరం యూనిట్ ఇంఛార్జ్‌లతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీ ముందుకు సాగుతోందంటే కార్యకర్తల బలమే కారణమని చంద్రబాబు ప్రశంసించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుభి మోగించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూటమి నేతలు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, కూటమి అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ప్రజలతో సత్సంబంధాలు ఉన్నవారే ఎన్నికల్లో గెలుస్తారని, డబ్బుతో గెలవాలని చూసేవారికి ఓటమి తప్పదని హితవు పలికారు.

పార్టీకి శిక్షణ ఇవ్వడం అనేది అత్యంత కీలకమైన కార్యక్రమమని ముఖ్యమంత్రి తెలిపారు. పార్టీ విలువలు, సిద్ధాంతాలను నూతన నాయకత్వానికి అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అనుభవం, పార్టీ భావజాలంపై పూర్తి అవగాహన ఉన్నవారితోనే శిక్షణ ఇప్పిస్తున్నామని, దీనివల్ల సిద్ధాంతాలు క్షేత్రస్థాయిలోకి వెళుతున్నాయని వివరించారు. నేతలు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై అధ్యయనం చేస్తూ, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.

సొంతంగా పత్రిక, ఛానల్ పెట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్న ‘గొడ్డలి పార్టీ’ విధానాలను కార్యకర్తలే తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను వాస్తవాలతో ప్రజలకు వివరించాలని కోరారు. గొడ్డలి పార్టీగా తాను అభివర్ణించిన పార్టీ అధ్యక్షుడి వల్లే రాష్ట్రంలో అధికారులు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారని, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక నాయకుడి వల్ల ఇలా జరగడం ఇదే ప్రథమమని తీవ్రంగా విమర్శించారు. 

రాజకీయాలను అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలను బెదిరించి, సొంత కంపెనీలలో పెట్టుబడులు పెట్టించారని ఆరోపించారు. నేరాలు చేయించి, వాటిని అలవాటుగా మార్చి, ఆ నేరాలే మెడకు చుట్టుకుంటాయనే సమయంలో వారిని అంతం చేయడమే ఆ పార్టీ విధానమని, ఇలాంటి వారి వ్యక్తిత్వాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని సూచించారు.

గత ప్రభుత్వం మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలతో ప్రజలను మోసం చేసిందని, 2019-24 మధ్య కాలంలో ఏకంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపిందని గుర్తు చేశారు. కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ టీడీపీ అని, పదవులు తీసుకుని పనిచేయని వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Chandrababu Naidu
TDP Central Office Mangalagiri
Andhra Pradesh Local Body Elections
TDP Janasena BJP Alliance
Telugu Desam Party Training
AP CM Chandrababu Naidu Speech

More Telugu News