పదోసారి సవాల్ చేస్తున్నా.. డేట్-టైమ్-ప్లేస్‌ ఫిక్స్ చెయ్ జ‌గ‌న్.. చర్చకు నేను రెడీ: నారా లోకేశ్

Nara Lokesh challenges Jagan Mohan Reddy to fix time and place for a debate
  • ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో లోకేశ్
  • ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియని అజ్ఞాని జగన్ అని విమర్శ
  • సార్వత్రిక ఎన్నికల కన్నా 2 శాతం ఎక్కువ ఓట్లతో స్థానిక ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా
  • జగన్ తప్పుడు పనుల వల్లే వైసీపీ నేతలు జైళ్లకు వెళుతున్నారని ఆరోపణ
  • మరో మూడుసార్లు గెలిస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని వ్యాఖ్య
"జగన్.. నీకు పదోసారి సవాల్ విసురుతున్నా. డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చెయ్. పులివెందులకు రమ్మన్నా వస్తా, తాడేపల్లిలోని నీ కొంపకు రమ్మన్నా వస్తా. చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని నువ్వు నాకు నీతులు చెబుతావా?" అంటూ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. జగన్ లాంటి చేతకాని నాయకుడిని తాను ఎన్నడూ చూడలేదని, ఆయనకు నిజం చెబితే తల వెయ్యి ముక్కలయ్యే శాపం ఉందని ఎద్దేవా చేశారు.

డీఎస్సీ, వెలిగొండపై ఘాటు విమర్శలు 
గత ప్రభుత్వంలో డీఎస్సీపై 150 కేసులు వేయించినా, తాము విజయవంతంగా పూర్తిచేసి ఉద్యోగాలు ఇచ్చామని లోకేశ్ గుర్తుచేశారు. "అది మా చిత్తశుద్ధి. మీరు నిర్వహించిన గ్రూప్-1 అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానమే చెప్పింది. ఈ ఏడాది మాత్రమే కాదు, రాబోయే మూడేళ్లు కూడా డీఎస్సీ నిర్వహిస్తాం. జగన్ వాళ్ల తాత వచ్చినా మమ్మల్ని అడ్డుకోలేరు" అని స్పష్టం చేశారు. 

వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చంద్రబాబేనని, త్వరలో పూర్తి చేసి ప్రారంభించేది కూడా చంద్రబాబేనని అన్నారు. పనులు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారని, ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి పనులు పూర్తి చేస్తుంటే క్రెడిట్ చోరీ అంటున్నారని మండిపడ్డారు.

స్థానిక ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యం 
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. "అందరం కలిసికట్టుగా పనిచేస్తే సార్వత్రిక ఎన్నికల కంటే 2 శాతం అదనపు ఓట్లతో ఘన విజయం సాధిస్తాం. కార్యకర్తలు నా చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరగండి. పదవులు ఇచ్చే బాధ్యత నాది" అని భరోసా ఇచ్చారు. 

మై టీడీపీ యాప్ ద్వారా 4 లక్షల మంది నాయకులను పర్యవేక్షిస్తున్నామని, పార్టీ కార్యక్రమాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఒంగోలు పోతురాజు కాల్వ, నల్లకాలువల అభివృద్ధికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలకు దూరం అవుతామని హితవు పలికారు.

మరో మూడుసార్లు గెలవాలి 
రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టాలంటే కనీసం మరో మూడుసార్లు వరుసగా టీడీపీ కూటమి గెలవాల్సిన అవసరం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. "గత ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో కలిసి 94 శాతం సీట్లు గెలిచాం. మన ఐక్యత ఇలాగే కొనసాగాలి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకుంటే రాష్ట్రమే నష్టపోతుంది" అని అన్నారు. 

తనపై గత ప్రభుత్వం 23 తప్పుడు కేసులు పెట్టిందని, వాటిలో అటెంప్ట్ మర్డర్, ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. తాను జగన్‌లా కంచుకోటలో పోటీ చేయలేదని, 40 ఏళ్లలో గెలవని మంగళగిరిలో 91 వేల మెజారిటీతో గెలవడం తన సత్తా అని అన్నారు.

జగన్ తప్పులకు వైసీపీ నేతల బలి 
జగన్ చేసిన తప్పుడు పనుల వల్లే కొందరు వైసీపీ నాయకులు ఈరోజు జైళ్లకు వెళుతున్నారని, ఇప్పుడు వారంతా కులం కార్డు వాడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 17 వేల మందికి పదవులు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అమర్‌నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య హత్యలను ప్రస్తావిస్తూ వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగాయన్నారు. మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావుల ఉదంతాలను ఉటంకిస్తూ.. వారు చేసిన తప్పుల వల్లే చట్టపరమైన చిక్కుల్లో పడ్డారని, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం ప్రస్తుతం కఠిన పరిస్థితుల్లో ఉందని, రూపాయి ఆదాయంలో 94 పైసలు జీతాలకే పోతోందని, అయినా చంద్రబాబు రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని లోకేశ్ తెలిపారు.
Advertisement
Nara Lokesh
Jagan Mohan Reddy
AP DSC Recruitment
Veligonda Project
TDP vs YSRCP
Andhra Pradesh Politics

More Telugu News