ఆత్మకథగా రజనీకాంత్ ప్రస్థానం.. అధికారికంగా ప్రకటించిన కుమార్తె సౌందర్య
- తన తండ్రి ఆత్మకథ రాస్తున్నారన్న సౌందర్య
- 'ఒక యోగి ఆత్మకథ' మాదిరే ఈ పుస్తకం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని వెల్లడి
- తన తండ్రి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం వస్తే అది తనకు ప్రత్యేకమని వ్యాఖ్య
సూపర్స్టార్ రజనీకాంత్ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని, జీవిత అనుభవాలను పుస్తక రూపంలో అభిమానులకు అందించబోతున్నారని ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె... ఆ పుస్తకం తయారీ ప్రాసెస్ చాలా ప్రత్యేకంగా సాగుతోందని తెలిపారు.
రజనీకాంత్ ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలోని విజయాలు, వ్యక్తిగత అనుభవాలు, అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంటోంది. పరమహంస యోగానంద రాసిన ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకంలాగే ఈ పుస్తకం కూడా తరతరాలకు స్ఫూర్తినిస్తుందని సౌందర్య నమ్మకం వ్యక్తం చేశారు.
ఒకవేళ తన తండ్రి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే అవకాశం వస్తే అది తనకు అత్యంత ప్రత్యేకమైన విషయమని ఆమె తెలిపారు. సృజనాత్మకతకు స్పష్టత, క్రమశిక్షణ చాలా ముఖ్యమని తన తండ్రి నేర్పించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం సౌందర్య నిర్మాణంలో నెట్ఫ్లిక్స్ కోసం ‘లవ్’ అనే రొమాంటిక్ తమిళ వెబ్సిరీస్ రూపొందుతోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్లో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా... ఇది అక్టోబరులో నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది.