ప్రజలకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: నిమ్మల రామానాయుడు
- హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ద్వారా రైతులకు నీటిని అందించామన్న నిమ్మల
- ప్రజలకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
- కర్నూలు జిల్లాకు 10 గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయన్న మంత్రి
ఎల్నినో ప్రతికూల ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలను ఆదుకునేందుకు హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ద్వారా సాగు, తాగునీటిని అందించామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రజలకు ఎటువంటి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
రైజింగ్ స్టార్గా నిలిచిన నారా లోకేశ్ నాయకత్వంలో డ్రోన్ హబ్తో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా త్వరలోనే మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు.
కర్నూలు జిల్లాకు రెండు విడతల్లో 10 గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయని, వచ్చే ఏడాది ఆలూరుకు మరొక గురుకులాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు, బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు.
రాయలసీమ ప్రాజెక్టుల అంశాలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చుపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త ఇళ్లు, పింఛన్లను అందజేస్తామని ప్రకటించారు.