రేవంత్ సర్కార్‌పై బీజేపీ సమరం.. 48 గంటల దీక్షకు రాంచందర్ రావు

BJP battle against Revanth government Ramachander Rao 48 hour Deeksha
  • అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ సర్కార్ పతనం ఖాయమన్న బీజేపీ
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం 48 గంటల నిరాహార దీక్ష
  • 30 శాతం కమీషన్ల సర్కార్‌గా కాంగ్రెస్ మారిందని ఆరోపణ
  • విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని సవాల్
  • దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ.. అయినా వెనక్కి తగ్గమన్న బీజేపీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్ములాటలతో కూలిపోయే దశకు చేరుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి దీక్ష ప్రారంభమవుతుందని రాంచందర్ రావు తెలిపారు. పోలీసుల ఆంక్షలకు భయపడబోమని, అనుమతి నిరాకరించినా దీక్ష చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12,000 కోట్లకు చేరాయని, దీనివల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ పాలనలో 10-15 శాతం కమీషన్లు ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం '30 శాతం కమీషన్ల సర్కార్'గా మారిందని రాంచందర్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్‌ది కుటుంబ పాలనైతే, ఇప్పుడు 'రేవంత్ బ్రదర్స్' పాలన నడుస్తోందని విమర్శించారు. 22ఏ నిబంధనల పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని వేధిస్తున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరిట హామీలిచ్చిన రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని అన్నారు. దమ్ముంటే హైదరాబాద్ వచ్చి విద్యార్థుల సమస్యలపై 'ఛత్రోంకీ గూంజ్' నిర్వహించి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కాగా, ప్రధాని మోదీ 25 ఏళ్ల సుపరిపాలన పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు 'మోదీ 25 సేవా సంకల్ప్ అభియాన్' నిర్వహిస్తామని ప్రకటించారు.
Advertisement
Ramachander Rao
Telangana BJP Protest
Fee Reimbursement Arrears
Revanth Reddy Government
Hyderabad BJP Deeksha
Telangana Congress Corruption

More Telugu News