ఖర్గే వద్ద కొండా సురేఖ పంచాయితీ!

Konda Surekha meets Mallikarjun Kharge over internal party issues
  • ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ?
  • తనపై కుట్ర జరుగుతోందని ఖర్గేకు వివరించిన సురేఖ
  • సీఎం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని సురేఖకు ఖర్గే హితవు
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. ఆదివారం బెంగళూరులో ఖర్గేతో మంత్రి సురేఖ సమావేశమైనట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి రావడానికి ఒక్కరోజు ముందు ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సురేఖ నేరుగా అధిష్ఠానాన్ని కలవడం చర్చనీయాంశమైంది.

సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో కొండా సురేఖ తన వాదనను ఖర్గే ముందు వినిపించినట్లు సమాచారం. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ, గాంధీ కుటుంబానికి గానీ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె వివరించారు. పార్టీలోని కొందరు నేతలు తనను లక్ష్యంగా చేసుకుని, మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, దీనిపై విచారణ చేపట్టాలని ఆమె ఖర్గేను కోరినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని సురేఖకు స్పష్టం చేసినట్లు సమాచారం. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఏఐసీసీ ఎన్నికల కమిటీ పరిధిలోని అంశమని, వాటిపై ఏకపక్ష ప్రకటనలు చేయకూడదని ఆయన హితవు పలికినట్లు తెలిసింది.

కొండా సురేఖ కుమార్తె సుష్మిత.. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల టికెట్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సురేఖ, ఆమె కుమార్తెపై కఠిన చర్యలు తీసుకోవాలని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసే ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఆమె నేరుగా ఖర్గేను కలిసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
Advertisement
Konda Surekha
Mallikarjun Kharge
Telangana Congress
Revanth Reddy
AICC President
PCC Disciplinary Committee

More Telugu News