తెలంగాణ ఆరోగ్య మోడల్ భేష్.. మెచ్చుకున్న స్టాండింగ్ కమిటీ

Telangana Health Model is Excellent Praised by Standing Committee
  • తెలంగాణ వైద్య సేవలను కొనియాడిన పార్లమెంటరీ కమిటీ
  • ఆరోగ్యశ్రీ, టీ-డయాగ్నోస్టిక్స్ పనితీరుపై ప్రశంసలు
  • రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలపై ప్రత్యేక సంతృప్తి
  • టిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ పనుల పురోగతిపై ఆరా
  • ప్రభుత్వ సీఎస్, వైద్యాధికారులతో కమిటీ సభ్యుల భేటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో అమలు చేస్తున్న విధానాలు, పేదలకు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొనియాడింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, టి-డయాగ్నోస్టిక్స్, పాలియేటివ్ కేర్ వంటి పథకాల పనితీరుపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేస్తున్న తీరును ప్రశంసించారు.

వివిధ రాష్ట్రాల్లో ప్రజారోగ్య వ్యవస్థలు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ గురువారం హైదరాబాద్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, జాతీయ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమైంది.

క్యాన్సర్ కేర్‌పై ప్రత్యేక సంతృప్తి ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న క్యాన్సర్ కేర్ మోడల్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షల నుంచి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న అత్యాధునిక రేడియేషన్, సర్జికల్, కీమోథెరపీ సేవల వరకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు జిల్లా, మండల స్థాయిల్లోనే సేవలందించే పాలియేటివ్ కేర్‌ కేంద్రాల నిర్వహణపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. వైద్య ఖర్చులతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఆరోగ్యశ్రీ పథకం ఆర్థిక కవచంలా నిలుస్తోందని సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఈ భేటీలో హైదరాబాద్‌లోని ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థలైన ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌ఐఎన్ ప్రతినిధులు తమ సరికొత్త ఆవిష్కరణలను కమిటీకి వివరించారు. తక్కువ ఖర్చుతో క్యాన్సర్ నివారణ మాలిక్యూల్స్ అభివృద్ధి, క్యాన్సర్ కణాల జన్యుపరమైన మార్పులపై పరిశోధనలు, పోషకాహార లోపాల నివారణ వంటి అంశాలపై తమ ప్రయోగాలను వివరించారు.

టిమ్స్, ఎయిమ్స్‌పై ఆరా:

హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రుల నిర్మాణాల పురోగతిపై కమిటీ ప్రత్యేకంగా ఆరా తీసింది. బీబీనగర్ ఎయిమ్స్ పనుల వివరాలను కూడా అడిగి తెలుసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఆర్ నిధులను ప్రజారోగ్య వ్యవస్థల బలోపేతానికి మరింత సమర్థంగా వినియోగించుకోవాలని కమిటీ సూచించింది.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ రాంగోపాల్ యాదవ్ నేతృత్వంలోని ఈ బృందంలో 21 మంది ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, డాక్టర్ బి.పార్థసారథిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొని, రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అంశాలను ఇతర సభ్యులకు వివరించారు.
Advertisement
Telangana Health Model
Parliamentary Standing Committee
Aarogyasri Scheme
T Diagnostics
Cancer Care Telangana
TIMS Hyderabad

More Telugu News