చెక్ బౌన్స్ కేసు: జనగామ కోర్టు సంచలన తీర్పు.. రూ.1.2 కోట్ల జరిమానా

Check bounce case Jangaon court sensational verdict 12 crore fine
  • చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, భారీ జరిమానా
  • 2013లో తీసుకున్న కోటి రూపాయల అప్పు వ్యవహారంలో వివాదం
  • రూ.80 లక్షల చెక్కులు బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
  • నిందితుడికి రూ.1.20 కోట్ల జరిమానా.. చెల్లించకుంటే మరో 6 నెలల జైలు
దశాబ్ద కాలం నాటి ఆర్థిక వివాదానికి జనగామ కోర్టు సంచలన తీర్పుతో ముగింపు పలికింది. కోటి రూపాయల అప్పుకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ, ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1.2 కోట్ల భారీ జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే, అదనంగా మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.

జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన మెండె సప్తగిరి, స్టేషన్ రోడ్‌కు చెందిన గజ్జి మధు దగ్గర 2013 మార్చి 18న రూ.కోటి అప్పుగా తీసుకున్నారు. రెండు నెలల్లో అసలు తిరిగి చెల్లిస్తానని, మూడేళ్ల పాటు తన వ్యాపారంలో వచ్చే లాభాల్లో వాటా ఇస్తానని అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు.

అయితే, ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించడంలో సప్తగిరి విఫలమయ్యారు. ఈ క్రమంలో, 2018 డిసెంబర్ 2న గజ్జి మధుకు రూ.80 లక్షల విలువైన రెండు చెక్కులను (ఒక్కొక్కటి రూ.40 లక్షల చొప్పున) అందజేశారు. అదే రోజు మధు ఆ చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేయగా, సప్తగిరి ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అవి డిసెంబర్ 4న బౌన్స్ అయ్యాయి.

దీంతో మోసపోయానని గ్రహించిన మధు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై సీసీ 45/2014 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, సప్తగిరిని నిందితుడిగా చేర్చారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న జనగామ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయాధికారి జి. శశి.. సప్తగిరిని దోషిగా నిర్ధారించారు. అతనికి ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.1.2 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తన తీర్పులో స్పష్టం చేశారు.
Advertisement
Mende Saptagiri
Jangaon Court
Check bounce case
Gajji Madhu
Court verdict
Telangana legal news

More Telugu News