సదరన్ జోనల్ కౌన్సిల్‌లో చంద్రబాబు ప్రసంగానికి దక్షిణాది సీఎంల ప్రశంసలు

Chandrababu vision in Southern Zonal Council wins praise from South CMs
  • మహాబలిపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
  • దక్షిణాది అభివృద్ధికి బ్లూప్రింట్ సమర్పించిన సీఎం చంద్రబాబు
  • కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్, గోదావరి-కావేరి అనుసంధానంపై కీలక ప్రతిపాదనలు
  • విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు ప్రసంగంపై దక్షిణాది సీఎంల ప్రశంసలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నేడు మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ఒక స్పష్టమైన బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా పురోగమించగలవని ఆయన ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి-బెంగళూరు-చెన్నై నగరాలను కలుపుతూ సమగ్ర రవాణా వ్యవస్థ, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్ అవసరమని సూచించారు. దేశ జీడీపీలో దాదాపు 31% వాటా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు, 'వికసిత్ భారత్' నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

గోదావరి-కావేరి అనుసంధానంపై కీలక సూచన
గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీల నీటిని మళ్లించవచ్చని, తద్వారా తమిళనాడు తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు వివరించారు. ఈ విషయంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులకు కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.

విభజన సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను కూడా ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 12 ఏళ్లుగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన పూర్తికాలేదని, ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ప్రస్తావించారు. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ, విశాఖ-విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగంపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. "సీనియర్ నాయకుడిగా చంద్రబాబు విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడారు" అని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొనియాడారు.

Advertisement
Chandrababu Naidu
Southern Zonal Council
Godavari Cauvery river linking
Bullet Train Corridor
South Coast Railway Zone
Viksit Bharat 2047

More Telugu News