కంటెంట్ క్రియేటర్లకు డబ్బులు.. లక్ష వ్యూస్‌కు రూ.10,000 ఇస్తామన్న బీహార్ సర్కార్

Bihar government to pay content creators 10000 rupees for one lakh views
  • సోషల్ మీడియా క్రియేటర్లకు డబ్బులిచ్చే పథకానికి బీహార్ కేబినెట్ ఆమోదం
  • ప్రభుత్వ పథకాలపై వీడియోలకు లక్ష వ్యూస్ వస్తే రూ.10,000 చెల్లింపు
  • ఒక వీడియోకు గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం
  • సీఎం సామ్రాట్ చౌధరి అధ్యక్షతన సమావేశంలో కీలక నిర్ణయాలు
  • రాష్ట్రంలో ఏఐ వ్యవస్థ అభివృద్ధికి తైయో ఏఐ సంస్థతో ఒప్పందం
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు బీహార్ ప్రభుత్వం ఓ బంపరాఫర్ ప్రకటించింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వీడియోలు రూపొందించి, వాటికి ఆదరణ లభిస్తే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. నిన్న‌ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

'బీహార్ సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ మీడియా నిబంధనలు-2026'కు సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ పథకాలపై కంటెంట్ రూపొందించే ఎంపిక చేసిన క్రియేటర్లు, తమ వీడియోలకు 30 రోజుల తర్వాత లక్ష వ్యూస్ వస్తే రూ.10,000 అదనపు చెల్లింపునకు అర్హులవుతారు. అయితే, ఈ చెల్లింపునకు కొన్ని నిబంధనలు, వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వీడియోకు గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు మాత్రమే చెల్లింపులు జరుపుతారు.

ఈ విషయంపై త్వరలోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. అలాగే, జాబితాలో ఉన్న సోషల్ మీడియా క్రియేటర్ల ఫాలోవర్ల సంఖ్యను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని పేర్కొంది.

ఇదే సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, తైయో ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందానికి (ఎంఓయూ) కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 13 ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభించింది.
Advertisement
Bihar Government
Social Media Content Creators
Samrat Choudhary
Bihar Social Media Policy 2026
Government Schemes Promotion
Taiyo AI India

More Telugu News