ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో కలవను: కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha says she will not join BRS as long as she is alive
  • షోకాజు నోటీసు లేకుండానే పార్టీ నుంచి పంపించారని ఆవేదన
  • రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా
  • బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటన
  • కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం
తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీతో భవిష్యత్తులో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, "ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయను" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత సంబంధాలు వేరని, రాజకీయాలు వేరని ఆమె తేల్చి చెప్పారు. అయితే, బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా చేయడం తమ సిద్ధాంతం కాదని కూడా అన్నారు.

పార్టీ నుంచి తనను బహిష్కరించిన తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి షోకాజు నోటీసు ఇవ్వకుండానే తనను పార్టీ నుంచి పంపించేశారని, సస్పెన్షన్‌కు ఏడాది ముందు నుంచే తనను పక్కన పెట్టారని ఆరోపించారు. అయినప్పటికీ, నైతిక విలువలకు కట్టుబడి తానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. తన తండ్రి కేసీఆర్‌ను తాను ఎన్నడూ ఎదిరించలేదని ఆమె పేర్కొన్నారు.

తన నూతన పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. "మాది ఆర్ట్ మూవీ కాదు, కమర్షియల్ మూవీ. నేను గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారో తెలియదు" అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్ తరహాలోనే తాను కూడా సరికొత్త చరిత్ర సృష్టిస్తానని ధీమాగా చెప్పారు.

సామాజిక న్యాయం, లౌకికవాదమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని ఆమె వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఇప్పటికే 100 రోజుల్లోనే 42 నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేశామని ఆమె వివరించారు.
Advertisement
Kalvakuntla Kavitha
Telangana Rakshana Sena
BRS Party
K Chandrashekar Rao
Revanth Reddy

More Telugu News