పీవోకేలో పాక్ బలగాల కాల్పుల్లో బ్రిటిష్ పౌరుడి మృతి.. కేసు పెట్టేందుకే భయపడుతున్న కుటుంబం

British citizen killed in PoK by Pakistan forces family afraid to file case
  • పీవోకేలో పాక్ బలగాల కాల్పుల్లో బ్రిటిష్ పౌరుడు మహ్మద్ అక్తర్ మృతి
  • నిరసనల నేపథ్యంలో మరో బ్రిటిష్ జాతీయుడు వకాస్ ఆరిఫ్‌ను అరెస్ట్ చేసిన దళాలు
  • కేసు నమోదుకు భయపడుతున్న మృతుడి కుటుంబ సభ్యులు
  • ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రభుత్వం
  • పీవోకేలోని ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని ట్రావెల్ అడ్వైజరీ జారీ
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో చెలరేగిన నిరసనల సందర్భంగా పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ బ్రిటిష్ పౌరుడు మరణించాడు. మరో బ్రిటిష్ జాతీయుడిని అదుపులోకి తీసుకుని రెండు నెలలుగా నిర్బంధంలో ఉంచినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలపై బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

బ్రిటన్‌లోని పీటర్‌బరో నగరానికి చెందిన 50 ఏళ్ల మహ్మద్ అక్తర్, పీవోకేలో ఆర్థిక, ఎన్నికల సంస్కరణల కోసం జరిగిన నిరసనల సమయంలో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 9న కోట్లి నగరంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తూటా తగలడంతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారని 'ది గార్డియన్' పత్రిక పేర్కొంది. 

"ఆయన నిరసనలో పాల్గొనలేదు. కానీ ఆయన ఇంటికి సమీపంలోనే ఆందోళనలు జరిగాయి. బలగాల కాల్పుల్లో గుండె పక్కన తూటా గాయమైంది" అని అక్తర్ బంధువు మహ్మద్ సాద్ తెలిపారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా తమ కుటుంబం భయపడుతోందని ఆయన వాపోయారు.

ఇదే తరహాలో జూన్ 5న జరిగిన నిరసనల తర్వాత నాటింగ్‌హామ్‌కు చెందిన 38 ఏళ్ల వకాస్ ఆరిఫ్‌ను మిర్‌పూర్ నగరంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడు నిరసనల్లో పాల్గొనకపోయినా, ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారని, ఇప్పటివరకు కోర్టులో కూడా హాజరుపరచలేదని వకాస్ సోదరి సుమేరా ఆరోపించారు.

ఈ ఘటనలపై బ్రిటన్ విదేశాంగ కార్యాలయం (ఎఫ్‌సీడీఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ అధికారులు ఇస్లామాబాద్‌లోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపింది. ఆగస్టు 7న ట్రావెల్ అడ్వైజరీని అప్‌డేట్ చేస్తూ, పీవోకేలోని ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని తమ పౌరులకు సూచించింది.
Advertisement
Mohammad Akhtar
Pakistan Occupied Kashmir
British citizen death PoK
Waqas Arif
Pakistan security forces
UK Foreign Office

More Telugu News