మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సహా 13 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
- ఆత్మకూరులో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
- అనుమతి లేదంటూ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మేకపాటి విక్రమ్రెడ్డితో పాటు మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్తో గత నాలుగు రోజులుగా ఆత్మకూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైసీపీ శ్రేణులు... మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించాయి.
అయితే, ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతి లేదంటూ జేఆర్పేట వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగి, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు గాను మేకపాటి విక్రమ్రెడ్డి, ఇతర ముఖ్య నేతలపై పోలీసులు చట్టపరంగా కేసులు నమోదు చేశారు.