టీడీపీ ఎమ్మెల్యే దామచర్లకు జనసేన నేత బాలినేని సవాల్
- ఒంగోలులో కూటమి నేతల మధ్య ముదిరిన రాజకీయ వైరం
- ఎమ్మెల్యే దామచర్ల అవినీతికి పాల్పడుతున్నారన్న బాలినేని
- దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని సవాల్
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ కూటమి రాజకీయం ఉద్రిక్తంగా మారింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆరోపణల పర్వం మరింత ముదిరింది. ఎమ్మెల్యే దామచర్ల అర్ధరాత్రి వరకు సెటిల్మెంట్లు, అవినీతికి పాల్పడుతున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బాలినేని స్పష్టం చేశారు. తన ఆరోపణలపై ధైర్యముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేద్దామని, సమయం చెబితే తాను కూడా వస్తానని సవాల్ విసిరారు.
ఒంగోలులో కూటమిలోని జనసేన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇక్కడ జరుగుతున్న అరాచకాలను త్వరలోనే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళతానని బాలినేని తెలిపారు. జనసేన సైనికులు వేసిన ఓట్లతోనే దామచర్ల గెలిచారని, దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ దామచర్ల రాజీనామా చేస్తే తన మద్దతుతో ఆయనపై పోటీ చేసి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తీరుతానని, లేదంటే జీవితాంతం రాజకీయాలు వదిలేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుండడంతో టీడీపీ, జనసేన హైకమాండ్ లు ఈ వ్యవహారంపై దృష్టిసారించాయి. కూటమి సమన్వయ కమటీ సభ్యులు ఇరువురు నేతలతో మాట్లాడి, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కూటమి ప్రతిష్ఠ దెబ్బతినే వరకు తీసుకురావద్దని స్పష్టం చేశారు.