మాట నిలబెట్టుకున్న పవన్ క‌ల్యాణ్‌.. పిఠాపురం రూపురేఖలు మార్చేస్తున్న డిప్యూటీ సీఎం

Pawan Kalyan keeps his word Deputy CM changing the face of Pithapuram
  • పిఠాపురంలో రూ.200 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేసిన పవన్
  • డిప్యూటీ సీఎం చొరవతో 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
  • ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి.. పలు గ్రామాల్లో తీరిన కష్టాలు
  • మత్స్యకార కాలనీలు, మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన రహదారి సౌకర్యం
  • ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు యుద్ధప్రాతిపదికన పరిష్కారం
ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలోనే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లె నుంచి పట్టణం వరకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 70 రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయింది. ఈ పనులతో గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల ప్రయాణ కష్టాలు తొలగిపోయి రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి.

ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం
ఉప్పాడ తీరంలో అలల కోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాయాపట్నం మత్స్యకారుల కోసం సుబ్బంపేట సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త మాయాపట్నం పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనపై పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ చూపారు. రూ.1.52 కోట్లతో 1.5 కి.మీ. సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు. అలాగే, కొత్తసూరాడపేట కాలనీకి రూ.93 లక్షలతో 1.6 కి.మీ. సిమెంట్ రోడ్డు వేసి, ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు.

డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. తుపాన్లకు దెబ్బతిన్న యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి, రామన్నపాలెం బీచ్ రోడ్డును రూ.88 లక్షలతో పునర్నిర్మించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ.79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని రూ.26.30 లక్షలతో నిర్మించి, 4 వేల మంది ప్రజల ఇబ్బందులను తొలగించారు.

గత ఏడేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కొండెవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పిఠాపురం-ఉప్పాడ ఆర్‌అండ్‌బీ రోడ్డును రూ.1.22 కోట్ల ఉపాధి నిధులతో పవన్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రహదారి నిర్మాణంతో విద్యార్థులు, రైతులు, వ్యాపారులతో పాటు సుమారు 8 వేల మంది ప్రజల ప్రయాణ కష్టాలు తీరాయి.
Advertisement
Pawan Kalyan
Pithapuram Development
AP Deputy CM
Road Construction Andhra Pradesh
Model Constituency
Pithapuram Infrastructure

More Telugu News